తెలంగాణ రైతులకు శుభవార్త.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-04 17:18:39.0  )
తెలంగాణ రైతులకు శుభవార్త.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు సోలార్ పంప్ సెట్లను ఉచితంగా అందించి వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కొండారెడ్డిపల్లెను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలాట్ పంప్ సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వంటగ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ ఏటా 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలని, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దుబారాను తగ్గించాలన్నారు. ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని, వినియోగదారులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బిజినెస్ హబ్ గా మారబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన సూచనలు చేశారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed