రోజురోజుకు పతనమవుతున్న ధరలు.. కోల్డ్ స్టోరేజీల్లోనే మిర్చి

by Mahesh |
రోజురోజుకు పతనమవుతున్న ధరలు.. కోల్డ్ స్టోరేజీల్లోనే మిర్చి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్టంలో మిర్చి రైతుల బాధలు అంతా ఇంతా కాదు.. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంట పండిస్తే అమ్ముకుందామనే సమయానికి గిట్టుబాటు ధరలు లేక రోజురోజుకూ పతనమవుతున్న ధరలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మూడు నెలలుగా మిర్చి ధరలు పతనమవడంతో అన్నదాతలు పంట ఉత్పత్తులను నష్టానికి అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు. గత గురువారం ఖమ్మం మార్కెట్‌లో సుమారు 3000 బస్తాల మిర్చి విక్రయాలు జరిగాయి. మార్చి, ఏప్రిల్‌లో క్వింటాల్‌కు రూ.16వేల-17వేల ధర పలికింది. కానీ ఇప్పుడు క్వింటాల్‌కు రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు మాత్రమే ధర పలుకుతుండడంతో రైతన్నల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

ప్రస్తుత ధర తో పోల్చితే కోల్డ్ స్టోరేజీ కిరాయి, ఎగుమతి, దిగుమతి, హమాలీ ఖర్చులతో కలిపి క్వింటాల్ కు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో తప్పని పరిస్థితుల్లో పెట్టుబడి కోసం పంటను నష్టానికైనా అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తేజ టైప్ ఏసీ మిర్చి, రెగ్యులర్ టైప్ నాన్ ఏసీ మిర్చి ధరలు భారీగా పడిపోయాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికి గురువారం క్వింటాల్ కు ధర రూ.17,500 నిర్ణయించగా, వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటాల్ కు రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు కొనుగోలు చేశారు. అదే మార్కెట్‌లో బుధవారం క్వింటాల్‌ ఏసీ మిర్చి ధర రూ.19,500 ఉండగా ఒక్కరోజులోనే క్వింటాల్‌కు రూ.2000 తగ్గింది.

నెల క్రితం ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.3 వేలకు పైగా తగ్గింది. మార్కెట్ లో నాన్ ఏసీ మిర్చి ధరలు మరింత పడిపోయాయి. క్వింటాల్ ఎండు మిర్చి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో చైనా, సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు తేజ రకం మిర్చి ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. తేజ మిరియాల నూనెను సాధారణంగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పండిస్తారు. గతంలో చైనా వ్యాపారులు తేజ మిర్చి కోసం బల్క్ ఆర్డర్లు ఇచ్చినా ఈసారి అలాంటి పరిస్థితి లేదు.. ఇతర దేశాల నుండి ఆర్డర్‌లు కూడా తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed