Congress : అబద్ధపు ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్ కేటీఆర్.. ఎక్స్‌లో కాంగ్రెస్ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |   ( Updated:2024-10-17 06:43:55.0  )
Congress : అబద్ధపు ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్ కేటీఆర్.. ఎక్స్‌లో కాంగ్రెస్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అబద్ధపు ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్ కేటీఆర్ అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా పలు విషయాలు పోస్ట్ చేసింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ పేరుతో ఫాక్స్ కాన్ కంపెనీ వెళ్ళిపోతుంది అంటూ ఫేక్ ప్రచారం చేశారని, డీకే కేసు ఫైల్ చేయడంతో తోక ముడిచారని, మళ్ళీ తమిళనాడు కి వెళ్తుంది అంటూ ప్రచారం చేశారని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఫాక్స్ కాన్ కంపెనీ కంపెనీ తెలంగాణలో మరింత విస్తరించే ఆలోచనలు చేస్తుండడంతో మళ్ళీ తోక ముడిచారని విమర్శించింది. దామగుండం రాడార్ కేంద్రం గత ప్రభుత్వంలో 2017లో అనుమతులు ఇచ్చారని, మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకాలకు తెర లేపుతున్నారని వెల్లడించింది.

కూల్చివేతలు ఆపాలని మొసలి కన్నీరు

అధికారం‌లో ఉన్నప్పుడు హైదరబాద్‌లో అక్రమ కట్టడాలు, ఆక్రమణలు కూల్చివేయాలని ఆదేశించారని, మళ్ళీ ఇప్పుడు కూల్చివేతలు ఆపాలి అని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించింది. ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే దుర్మార్గపు ప్రచారం చేశారని, పెయిడ్ రాతలు రాపించారని ఆరోపించింది. ప్రఖ్యాత ఇంజనీర్ కేసీఆర్ కుంగిపోయే కాళేశ్వరం కట్టించి లక్ష కోట్లు ప్రజాధనం వృధా చేశారని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో భారీగా కమిషన్లు దండుకున్నారని ఆరోపించింది. అన్ని జిల్లా కార్యాలయాల్లో బీఆర్ఎస్ పార్టీకి భూములు కేటాయించి కోట్ల రూపాయలతో బిల్డింగ్ లు కట్టించారని తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పును, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని, చేసిన అప్పులకు నేడు మిత్తీలు కట్టడమే సరిపోతుందని తెలిపింది.

గత ప్రభుత్వం అప్పులు రూ. 7 లక్షల కోట్లు

2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం రూ.49,618 కోట్లు అప్పు చేసిందని, రూ. 56,440 కోట్లు గతంలో తీసుకున్న రుణాలు అసలు, వడ్డీలను తిరిగి చెల్లించిందని ప్రకటిచింది. మూలధన వ్యయం కింద రూ.21,881 కోట్లు ఖర్చు చేసిందని, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, చేయూత, ఎల్పీజీ సబ్సిడీ, గృహ జ్యోతి, విద్యుత్ సబ్సిడీ, బియ్యం సబ్సిడీ, ఉపకార వేతనాలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు రూ.54,346 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంది. అప్పులను పునర్‌వ్యవస్థీకరించడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు ఆర్థిక సుస్థిరతను సుసాధ్యం చేసేందుకు కృషి చేస్తోందని వెల్లడిచింది.

Advertisement

Next Story

Most Viewed