కాంగ్రెస్ పార్టీలోకి మరో 13 మంది ఎమ్మెల్యేలు!

by Mahesh |
కాంగ్రెస్ పార్టీలోకి మరో 13 మంది ఎమ్మెల్యేలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్, ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తున్నది. కబురు పంపిన వెంటనే పార్టీలో చేరేందుకు సదరు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఒకరు..ఇద్దరు ఎమ్మెల్యేల చేరికలు కాకుండా ఏకంగా బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం కోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ పోకస్ పెట్టినట్లు తెలిసింది. అందుకే పార్టీ మారేందుకు రెడీగా ఉన్న ఆ 13 మంది ఎమ్మెల్యేలను వెయిటింగ్‌లో పెట్టినట్టు ప్రచారం ఉంది.

ఎక్కువ మంది గ్రేటర్ నుంచే

కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే ఉన్నట్లు తెలిసింది. ఆ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. దీనితో సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం ఉంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం వల్ల రాజకీయంగా నష్టమని నిర్ణయానికి వచ్చి, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం.

చేరికల కంటే విలీనంపై ఫోకస్

అసెంబ్లీలో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సీఎల్పీలో విలీనం కావాలంటే ఆ పార్టీకి ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది పార్టీ మారాలి. అప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మధ్య గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 4 కు చేరింది. అయితే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేలతో కలుపుకుంటే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 17 కు చేరిందని సీఎంకు క్లోజ్‌గా ఉండే ఓ కాంగ్రెస్ లీడర్ వివరించారు. ‘‘విలీనం కోసం మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఆ ఎమ్మెల్యేలతో మేం మాట్లాడుతున్నాం. నాలుగైదు రోజుల్లో మిగతా 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటారు’’అని సదరు లీడర్ అభిప్రాయపడ్డారు. అప్పటివరకు పార్టీ మారేందుకు రెడీగా ఉన్న 13 మంది గులాబీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉండేందుకు ప్రత్యేకంగా ఒకరికి టాస్క్ అప్పగించినట్టు తెలిసింది.

సెషన్‌లోపే విలీనం టార్గెట్

జూలై రెండో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ లోపే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్ శాసనభాపక్షంలో విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిసింది. కాస్త ఆసల్యమైతే సమావేశాల సమయంలోనైన విలీనం చేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నట్టు సమాచారం. అయితే ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారుతామని షరతులు పెట్టినట్లు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యేల డిమాండ్లను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారని, అక్కడి నుంచి వచ్చే ఆన్సర్ కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రచారం ఉంది.



Next Story