పోలీసులు చోద్యం చూస్తుండడం సిగ్గుమాలిన చర్య: డీకే అరుణ

by GSrikanth |
పోలీసులు చోద్యం చూస్తుండడం సిగ్గుమాలిన చర్య: డీకే అరుణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత, మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళి గౌడ్‌పై బీఆర్ఎస్ నాయకుల దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, సోమవారం రాత్రి తాండూర్‌లో మురళి గౌడ్‌పై స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరులు, పోలీసుల ముందే దాడి చేస్తుంటే చోద్యం చూస్తుండడం సిగ్గుమాలిన చర్యని అరుణ మండిపడ్డారు.

శాంతి భద్రతల విషయంలో తెలంగాణ భేష్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే కేటీఆర్‌కి, వారి పార్టీ నాయకులు చేసే అకృత్యాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే మురళి గౌడ్‌పై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపగా, గత నాలుగు రోజుల ముందు బెయిల్‌పై వచ్చిన మురళి ఇంటిపై దాడి చేసి కారు ధ్వంసం చేయడంతో పాటు, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసారని మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులతో పాటు, ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మురళి గౌడ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Next Story

Most Viewed