Raghunandan Rao: బడ్జెట్‌ను అర్థం చేసుకునే స్థాయి సీఎంకు లేదు

by Gantepaka Srikanth |
Raghunandan Rao: బడ్జెట్‌ను అర్థం చేసుకునే స్థాయి సీఎంకు లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ అర్థం కావాలంటే నిరుపేదల ఆకాంక్షల ద్వారా చూస్తేనే అర్థమవుతుందని, ఈ బడ్జెట్‌ను అర్థం చేసుకునే స్థాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులకు లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఏదైనా మంచి జరిగితే దాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటున్నాయని, లేదంటే ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెడుతున్నాయని, ఇది ఈ రెండు పార్టీలకు పరిపాటిగా మారిందని రఘునందన్ విమర్శలు చేశారు. ఫైనాన్స్ బిల్లుపై బుధవారం పార్లమెంట్‌లో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించే విధంగా ఫైనాన్స్ బిల్ ఉందని కొనియాడారు. ఇన్‌కం ట్యాక్స్ విభాగం, ఇతర విభాగాల్లో కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలో సర్కారు పారదర్శకత తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ సర్కార్ లెక్కాపత్రం లేకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని కాగ్ నివేదికనే చెబుతోందన్నారు.

కేంద్రం డివెల్యూషన్ 42 శాతం నిధులు నేరుగా రాష్ట్రానికి ఇస్తున్నా ప్రభుత్వం చెప్పడం లేదని రఘునందన్ రావు ఫైరయ్యారు. కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరిట నిధులు ఇచ్చినా.. కేసీఆర్.. డబుల్ బెడ్రూంలకు తానే డబ్బులు ఇస్తున్నట్టు గప్పాలు కొట్టారని, ఇప్పుడు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రజలను మభ్య పెడుతోందన్నారు. ఇందులో కేంద్రం డబ్బులు లేవా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. జీఎస్టీ, కాంగ్రెస్, సోనియాగాంధీ మానస పుత్రిక అని చెప్పి అమలు చేయలేకపోయారని విమర్శలు చేశారు. 2017లో మోడీ నేతృత్వంలో జీఎస్టీ అమలు చేయడం వల్ల రూ.2 లక్షల కోట్లకు పైగా వసూలు చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు డైరెక్ట్ ఫండ్ కింద రూ.48,000 కోట్లు వచ్చినా తెలంగాణ సర్కార్ తప్పుడు లెక్కలు చెబుతోందని మండిపడ్డారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో ప్రధాని మోడీని రఘునందన్ రావు కలిశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మోడీకి నూలు పోగుల దండతో సత్కరించారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. తెల్లపూర్ నుంచి సిద్దిపేట వరకు సర్వే పూర్తయిన రైల్వే లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని రఘునందన్ రావు కోరారు.

Advertisement

Next Story

Most Viewed