‘హైడ్రా’తో కాంగ్రెస్ తలగొక్కుంటోంది: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

by karthikeya |
‘హైడ్రా’తో కాంగ్రెస్ తలగొక్కుంటోంది: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా (Hydra) పేరుతో కాంగ్రెస్ పార్టీ తల గోక్కుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణ పేరుతో నది చుట్టపక్కలున్న పేద హిందువుల ఇండ్లను కూల్చివేసేందుకు కాంగ్రెస్ (Congress) సిద్ధమైందన్నారు. మలక్ పేట రేసు కోర్సు నుండి ముసారాంబాగ్ వరకు మూసీ (Musi) స్థలాలను ఒవైసీ అనుచరులు కబ్జా చేసుకున్నారని, వాటిని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. పేదల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ రోజు ఈ రోజు (శనివారం) హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని, హైడ్రాతో పాటు 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు బిల్లుల అంశాలే కాంగ్రెస్ పార్టీకి కొరవి పెట్టబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘ఏళ్ల తరబడి అన్ని అనుమతులు తీసుకుని, పన్నులు కడుతూ, బ్యాంకులోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే కూల్చి వేయడం ఎంత వరకు కరెక్ట్? హైడ్రా కూల్చివేతల వల్ల ప్రజలు కారుస్తున్న కన్నీళ్లు మీకు కనిపించడం లేదా? ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో మళ్లీ పేదల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమయ్యారు. జియాగూడలో దళిత సోదరులుండే ఇండ్లను కూల్చడానికి హైడ్రా వెళుతుంది, చాదర్ ఘాట్‌లో ఉండే హిందువుల ఇండ్ల వద్దకు పోయి కూలగొడతామని బెదిరిస్తుంది కానీ.. ఎంఐఎం గూండాలు, వాళ్ల వర్గం వాళ్లు మూసీని చెరబట్టి కట్టుకున్న ఇండ్లను, షెడ్లను, బిల్డింగులను ఎందుకు టచ్ చేయడం లేదు? ఒవైసీని టచ్ చేసే దమ్ముందా? కనీసం మూసీ వెంట ఉన్న ముస్లిం ఇండ్లను కూల్చే దమ్ముందా? రజకార్ల ముఠా పార్టీ ఎంఐఎం ఉన్నంత కాలం ఓల్డ్ సిటీ న్యూ సిటీ కాలేదు. ఒక వర్గం ఓట్ల కోసం ఒవైసీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ సాగిలపడుతున్నాయి. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒవైసీ సోదరులు (Owaisi Brothers) చెరువును ఆక్రమించి నిర్మించిన బిల్డింగులను ఎందుకు కూలగొట్టడం లేదు? ఇవాళ మూసీని ఆనుకుని ఉన్నారని న్యూమారుతీనగర్, చాదర్ ఘాట్, లంగర్ హౌజ్‌లోని పేదల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి... అదే మూసీని అనుకుని మలక్ పేట్ రేసు కోర్సు నుండి మూసారాంబాగ్ వరకు ఒవైసీ అనుచరులు ఆక్రమించుకున్న స్థలాలు, కట్టుకున్న బిల్డింగులు, ఇండ్లు కనపడడం లేదా..? వాటిని కూల్చే దమ్ము కాంగ్రెస్ సర్కార్‌కి ఉందా..?

బీఆర్ఎస్ (BRS) పాలనలోనూ కేసీఆర్ (KCR) సర్పంచుల ఉసురు పోసుకున్నారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదు. కేంద్రమే ప్రతి పైసా అందిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మాజీ సర్పంచులు, స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే వాళ్లంతా బీజేపీకి అండగా నిలబడాలని కోరుతున్నా. ఎన్నికల తరువాత గెలిచిన సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులందరితో కలిసి ‘ఛలో హైదరాబాద్’ పేరుతో మార్చ్ నిర్వహిస్తాం. కాంగ్రెస్ మెడలొంచి బిల్లులు వచ్చేలా చేస్తాం. పంచాయతీలకు నిధులందేలా చేస్తాం. అందుకోసం ఎన్ని పోరాటాలు చేసేందుకైనా బీజేపీ (BJP) సిద్ధంగా ఉంది.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

మూసీ సుందరీకరణ పెద్ద బోగస్:

మూసీ సుందరీకరణ పెద్ద బోగస్ అని, గత 30 ఏళ్ల నుండి ఈ మాటలు వింటూనే ఉన్నా ఇప్పటివరకు జరిగింది లేదని బండి సంజయ్ అన్నారు. ‘‘మూసీ ప్రక్షాళన పేరుతో ఒకసారి జపాన్ (Japan) నిధులు తెచ్చారు. ఇంకోసారి జమైకా (Jamaica) నిధులు ఖర్చు చేశారు. ఒకాయన ఏకంగా హుస్సేన్ సాగర్‌ (Hussain Sagar)ను కొబ్బరి నీళ్లలా మారుస్తానన్నాడు. చివరకు ఏమైంది? అదే మూసీ, అదే కంపు. తెచ్చిన నిధులు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి పోతే.. మూసీ కంపు బారిన పడి హైదరాబాద్ ప్రజలు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. జీతాలకే పైసల్లేక అల్లాడుతున్న ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసింది. అట్లాంటిది మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారు? కాళేశ్వరం (Kaleswaram) పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు చేసి జనం నెత్తిన శఠ గోపం పెట్టాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో మరో లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి జనం నడ్డి విరిచేందుకు సిద్ధమైంది.’’ అని కేంద్ర మంత్రి ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed