తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో అల్పపీడన గండం

by M.Rajitha |
తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో అల్పపీడన గండం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 5 నాటికి పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నుండి తెలంగాణ మీదుగా ఈ ఉపరితల ద్రోణి కొనసాగనుందని వివరించారు. కోస్తాంధ్ర తీరానికి అతి చేరువలో ఏర్పడే అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న కుండపోత వర్షాలకు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. తెలంగాణలో ఖమ్మం జిల్లా జలమయం కాగా, ఏపీలో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగి పోయాయి. వాగులు వంకలు పొంగి పొర్లి, రహదారులు తెగి అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేక చీకట్లో ఉన్నాయి. పొంగి పొర్లుతూన్న వాగులు, ఉపనదుల్లో చిక్కుకొని పలువురు మరణించారు. అయితే మరో 12 గంటల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందంటూ ప్రకటిస్తూనే.. మరో అల్పపీడన గండం పొంచి ఉందని వాతావరణశాఖ చెప్పడం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుబులు రేపుతోంది.

Next Story