‘లెటర్ వార్ కంటిన్యూ’.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు మరో లేఖ

by Satheesh |
‘లెటర్ వార్ కంటిన్యూ’.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు మరో లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ గాడి తప్పుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. ఆదివారం ప్రభుత్వ విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డికి బహింగలేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు చేపట్టారన్నారు. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నతవిద్య వరకు సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని, అరకొర వసతులు, టీచర్లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం వంటి సమస్యలు విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని మండిపడ్డారు.

రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యమిస్తున్నారు తప్ప, ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల సమయంలో కొత్తగా చేసిందేమీ లేదని, గత ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు 7 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, భోజన బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఎస్జీటీల బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ సుమారు 9 వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని, పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తామన్న సిబ్బందిని వెంటనే నియమించాలని, విద్యార్థులకు ఒక్క జత బట్టలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, రెండు జతల బట్టలు అందించాలని, విద్యార్థుల ఆకలి తీర్చే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని, సర్వశిక్షా అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో అంధకారం అలుముకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యావ్యవస్థను ఇన్ని సమస్యలను చుట్టుముట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం బాధాకరం అన్నారు. భావిభారత పౌరులను తయారుచేసే పాఠశాలల నిర్వహణను గాలికి వదిలేయడం విద్యాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా స్పందించి తక్షణమే పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించాలని లేఖలో డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed