తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్

by Satheesh |
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెట్టుబడికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. ‘బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్’ కంపెనీ రూ.700కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. బీర్లు, శీతల పానీయాలు, పర్‌ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆదివారం బాల్ బెవరేజ్ ప్యా్కేజింగ్ కంపెనీ ఇండియా కార్పోరేట్ వ్యవహారాల అధిపతి గణేశన్ భేటీ అయ్యారు. సంస్థ విస్తరణ ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ సంస్థకు రాష్ట్రంలో అవరసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కంపెనీ యూనిట్ ప్రారంభమైతే 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిన్నుల్లో దొరికే బీర్లు మహారాష్ట్రలో బాట్లింగ్ అవుతున్నాయని, ఇది 2 శాతం లోపలే ఉందని చెప్పారు.

కర్ణాటక, మహారాష్ట్రల్లో బీర్ల ప్యాకేజింగ్‌లో టిన్నుల వాడకం 25 శాతం వరకు ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తానని పేర్కొన్నారు. 500 మి.లీ పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో కొత్త బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని కోకాకోలా సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. రూ.1000 కోట్లతో ఏర్పాటయ్యే కోక్ బాట్లింగ్ యూనిట్‌కు బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ అల్యూమినియం టిన్నులను చేస్తుందని వివరించారు. పెట్టుబడులకు సంబంధించి పూర్తి ప్రణాళికను సమర్పించాలని గణేశన్‌కు శ్రీధర్ బాబు సూచించారు

Advertisement

Next Story

Most Viewed