అందరి చూపు బాలాపూర్ వైపే..నిమజ్జనానికి సిద్ధమైన గణపతి

by Jakkula Mamatha |   ( Updated:2024-09-16 02:47:10.0  )
అందరి చూపు బాలాపూర్ వైపే..నిమజ్జనానికి సిద్ధమైన గణపతి
X

దిశ, బడంగ్​పేట్​:హైదరాబాద్‌లో కదిలే తొలి వినాయకుడు.. బాలాపూర్ గణపతి నిమజ్జన నీరాజన వేడుకలకు సర్వం సన్నద్ధమైంది. 44 వసంతాల బాలాపూర్​ గణేష్ వార్షికోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాలు, 2024 బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో 31వ సారి ఎవరికి సొంతం కానుందో.. మరికొన్ని గంటల్లో తేలనుంది. 2023లో రూ.27 లక్షలకు దాసరి దయానంద్​రెడ్డి సొంతం చేసుకున్నారు. కాగా, ఈ యేడు జరుగనున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఎంతో ఆసక్తి రేకెత్తించనున్నది. ఈసారి లడ్డూ వేలానికి ఇప్పటివరకు ఐదుగురు మాత్రమే ఒక్కొక్కరు రూ.5 వేలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి లడ్డూ వేలంలో బాలాపూర్​ గ్రామస్తులు కూడా ముందుగానే డిపాజిట్​ చేశాక లడ్డూ వేలంలో పాల్గొనడానికి అర్హులని కొత్త రూల్ ​తీసుకొచ్చిన విషయం విదితమే.

గత సంవత్సరం 2023లో జరిగిన వేలంలో మొత్తాన్ని రూ. 27లక్షలను డిపాజిట్‌గా చూపిస్తేనే వేలం పాడడానికి అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో చివరగా సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రూ.27 లక్షలు డిపాజిట్​ చెల్లించిన వారికే లడ్డూ వేలంలో పాల్గొనడానికి అర్హులని బాలాపూర్​ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. పది రోజులుగా ప్రతి రోజూ బాలాపూర్ ​గణపతిని 30 నుంచి 40 వేల మంది దర్శించుకుంటే సెలవుదినాల్లో మాత్రం 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడు లేని విధంగా ఈ యేడు ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా భక్తులు బాలాపూర్​ గణపతిని దర్శించుకున్నారు.

గణపతి ఊరేగింపు..

44 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన బాలాపూర్​ గణపతి నిమజ్జన వేడుకలు మంగళవారం ప్రారంభం కానుంది. తెల్లవారుజామున 5 గంటలకు బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి పూజాతో పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి బాలాపూర్​ పురవీధుల గుండా అత్యంత భక్తి శ్రద్దలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ బాలాపూర్​ గణపతిని ఊరేగిస్తారు. బాలాపూర్​ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి సాక పెట్టి , కొబ్బరికాయ కొట్టి, మంగళ హారతులు పడుతారు. 9 గంటలకు బాలాపూర్​ గణపతి డీసీఎం వ్యాన్​లో బొడ్రాయి వద్దకు చేరుకుంటుంది. ఉదయం 9.30 గంటలకు బాలాపూర్​ గణేష్​ లడ్డూ వేలం పాట అట్టహాసంగా ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు వేలం పాటలో పోటా పోటీగా పాడడం కనబడుతుంది. గత ఏడాది లడ్డూను సొంతం చేసుకున్న డబ్బులు చెల్లించిన దాసరి దయానంద్​ రెడ్డిని బంగారు గొలుసుతో ఘనంగా సత్కరించనున్నారు.

​ గణేష్​​ శోభాయాత్రలో భారీ పోలీస్​ బందోబస్తు..

మంగళవారం జరగనున్న బాలాపూర్​ గణేష్​ నిమజ్జన శోభ యాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తెలిపారు. బాలాపూర్​ గణేష్​ శోభాయాత్ర వెంట ఒక డీసీపీ, ఒక అడిషనల్​ డీసీపీ, నలుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, 26 మంది ఎస్ఐలు, 208 మంది పోలీసు సిబ్బందితో పాటు రాపిడ్​యాక్షన్​ ఫోర్స్​తో పాటు పారామిలటరీ బలగాలు, స్పెషల్​ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారన్నారు. 30 సీసీ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed