మంత్రి శ్రీధర్ బాబుని కలిస్తే కడుపు మంట ఎందుకు ?

by Sridhar Babu |
మంత్రి శ్రీధర్ బాబుని కలిస్తే కడుపు మంట ఎందుకు ?
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుని కలిస్తే మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నకు కడుపుమండుతుందని, ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న తీరును ఘాటుగా విమర్శించారు. సిమెంట్ పరిశ్రమను తెరిపించేందుకు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుని కలిసి మంగళవారం విన్నవిస్తే మాజీ మంత్రి జోగు రామన్న రాజకీయాలు అంటగట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 8 ఏళ్ల కిందట ప్రారంభించిన చేనాక కొరట ఇప్పటికీ పూర్తి కాలేదని, ఒక ఎకరం భూమి కూడా తడవలేదని,మంత్రిగా, ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయకపోగా ఎదుటివారిని రాజకీయ అక్కసుతో విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సిమెంటు పరిశ్రమను కమీషన్ల కోసం ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తున్నారని రామన్న ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కు చెందిన మంత్రిని కలిస్తే రాజకీయ అక్కసు వెళ్లబోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా గతంలో ఏ కాంట్రాక్టర్ దగ్గర ఎన్ని కమీషన్లు నొక్కావో.. తెలుసునని, అవసరం వచ్చినప్పుడు నీ బండారం బయటపెడతానని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ కేంద్ర మంత్రిని జోగు రామన్న ఎందుకు కలిశాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం ఎవరినైనా కలవచ్చని, మంచి పనులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఇందులో పార్టీ నాయకులు అంకత్ రమేష్, మయూర్ చంద్ర ,లాలామున్నా ,జోగు రవి, దినేష్ మటో లియా, ముకుంద్, తోకల నరేష్, మహేష్, వెంకన్న, భీమ్ సన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed