మాల్దీవులకు టీడీపీ నేత పట్టాభి? ఫొటోలు వైరల్

by Anukaran |
Pattabhiram
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ ఆరోపణల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఎన్టీఆర్ భవన్‌తోపాటు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. అంతేకాదు పట్టాభి నివాసంపైనా దాడులు చేశారు.

ఆ దాడులు అనంతరం టీడీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్ష చేస్తే.. వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టింది. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో హల్‌చల్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతికి ఈ వ్యవహారపై ఫిర్యాదు సైతం చేశారు. అయితే బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన పట్టాభి ఏమయ్యారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతలో పట్టాభి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోలు ప్రత్యక్షమవ్వడం మరింత చర్చకు దారి తీసింది.

Pattabhi

సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పటమట పీఎస్‌లో పట్టాభిపై కేసు నమోదు అవ్వడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం విడుదలయ్యారు. శనివారం బెయిల్‌‌పై విడుదలైన పట్టాభి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పట్టాభి ఎక్కడకు వెళ్లారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇలాంటి తరుణంలో పట్టాభి ఎయిర్ పోర్ట్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మాలే ఎయిర్‌పోర్టులో పట్టాభి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఫ్లైట్ నంబర్లతో సహా అందులో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం పట్టాభి మాల్దీవులలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ ఫొటోలు తాజాగా తీసినవా లేదా పాతవి పోస్టు చేశారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. పట్టాభి మాల్దీవులకు వెళ్లారా లేదా అనే విషయంపై అటు పార్టీ నేతలు, ఇటు ఆయన కుటుంబ సభ్యులు స్పష్టత ఇవ్వలేదు.

Next Story