ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో ప్రీక్వార్టర్స్‌కు అంకుషిత

by Harish |
ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో ప్రీక్వార్టర్స్‌కు అంకుషిత
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి అవకాశమైన వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత మహిళా బాక్సర్ అంకుషిత బోరో శుభారంభం చేసింది. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 60 కేజీల కేటగిరీ బరిలోకి దిగిన ఆమె తొలి రౌండ్‌లో 4-1 తేడాతో మంగోలియాకు చెందిన నమున్ మోంఖోర్‌‌ను మట్టికరిపించింది. మూడు రౌండ్లలోనూ అంకుషిత స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మరోవైపు, పురుషుల 80 కేజీల కేటగిరీలో అభిమన్యు నిరాశపరిచాడు. రెండో రౌండ్‌లో కెలిన్ కాసిడి(ఐర్లాండ్) చేతిలో 5-0 తేడాతో ఓడిపోయి ఇంటిదారిపట్టాడు. మంగళవారం జరగబోయే రెండో రౌండ్‌లో సచిన్ సివాచ్(57 కేజీలు), అభినాష్(63.5 కేజీలు), నిశాంత్ దేవ్(71 కేజీలు) పోటీపడనున్నారు. ఇప్పటివరకు పురుషుల కేటగిరీలో ఒక్క ఒలింపిక్ బెర్త్ కూడా దక్కలేదు. మహిళల కేటగిరీలో లవ్లీనా బోర్గోహైన్(75 కేజీలు), నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు) ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed