సింధు, సైనా నెహ్వాల్ ఆ తర్వాత ఆ ఘనత సాధించిన అష్మిత

by Harish |
సింధు, సైనా నెహ్వాల్ ఆ తర్వాత ఆ ఘనత సాధించిన అష్మిత
X

దిశ, స్పోర్ట్స్ : బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయిలాండ్ మాస్టర్స్‌ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి అష్మిత చాలిహా సత్తాచాటుతున్నది. తాజాగా ఆమె టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అష్మిత 21-14, 19-21, 21-13 తేడాతో ఇండోనేషియా క్రీడాకారిణి ఎస్టర్ నురిమి వార్డోయోను చిత్తు చేసింది. 57 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో అష్మిత పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ నెగ్గి అష్మిత శుభారంభం చేసింది. మొదట్లో 14-10తో వెనుకబడిన ఆమె ఆ తర్వాత వరుసగా 11 పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకుంది. అయితే, రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో 19-15తో అష్మిత వరుస గేమ్‌ను దక్కించుకునేలా కనిపించింది. అయితే, ఇండోనేషియా క్రీడాకారిణి పుంజుకుని ఆమెకు షాకివ్వడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. ఇక, మూడో గేమ్‌లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వని అష్మిత ఏకపక్షంగా మూడో గేమ్‌ను నెగ్గి విజేతగా నిలిచింది. దీంతో కెరీర్‌లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌ సూపర్ 300 ఈవెంట్‌లో తొలిసారిగా సెమీస్‌లో అడుగుపెట్టింది. అంతేకాకుండా, భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత భారత్ వెలుపల బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్‌లో సెమీస్‌కు చేరుకున్న మూడో భారత ఉమెన్స్ సింగిల్స్ క్రీడాకారిణిగా నిలిచింది.

మెన్స్ సింగిల్స్‌లో యువ షట్లర్ మిథున్ మంజునాథ్ పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో మంజునాథ్ 19-21, 15-21 తేడాతో నెదర్లాండ్స్ ఆటగాడు మార్క్ కాల్టోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరోవైపు, ఉమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జోడీ సైతం టోర్నీ నుంచి నిష్ర్కమించింది. క్వార్టర్స్‌లో 4వ సీడ్, ఇండోనేషియాకు చెందిన ఫెబ్రియానా ద్విపూజీ కుసుమ-అమలియా కహయా ప్రతివి జోడీ 21-12, 17-21, 23-21 తేడాతో గాయత్రి జోడీ ఓడిపోయింది.

Advertisement

Next Story

Most Viewed