భారత ఫుట్‌బాల్‌కు టార్చ్‌బేరర్

by Harish |   ( Updated:2024-05-17 13:15:47.0  )
భారత ఫుట్‌బాల్‌కు టార్చ్‌బేరర్
X

దిశ, స్పోర్ట్స్ : ‘ప్రతి 30 ఏళ్లకోసారి బతుకు తలూకు ఆలోచన మారుతుంది. సినిమావాళ్లు ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ, ప్రతి జనరేషన్‌లోనూ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు ఒక్కడే వస్తాడు. అతన్నే టార్చ్ బేరర్ అంటారు.’ అరవింద సమేత వీర రాఘవ మూవీలోని ఈ డైలాగ్ సునీల్ ఛెత్రికి సరిగ్గా సరిపోతుందేమో. భైచింగ్ భూటియా తర్వాత భారత ఫుట్‌బాల్‌కు అతనో టార్చ్‌బేరర్. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే ఆటకు లేదనేది కాదనలేని సత్యం. కానీ, ఫుట్‌బాల్‌కు ఓ బ్రాండ్ క్రియేట్ చేశాడు సునీల్ ఛెత్రి. భారత గడ్డపై ఫుట్‌బాల్ అంటేనే సునీల్ ఛెత్రి అనేలా అతను లిఖించిన చరిత్ర అసామాన్యం.. అసాధారణం.

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 19 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భాగంగా జూన్ 6న కువైట్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ తనకు చివరిదని తెలిపాడు. 23 ఏళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో ఛెత్రి ఆట మొదలైంది. 2001-02 వరకు సిటీ క్లబ్ ఢిల్లీ తరపున ఆడాడు. 2005లో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత సంచలన ప్రదర్శనతో తక్కువ సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగాడు. భూటియా తర్వాత 2012లో తొలిసారి భారత జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. 2015, 2021, 2023‌లో భారత్ చాంపియన్‌గా నిలిచింది. 2008లో ఏఎఫ్‌సీ చాలెంజ్ కప్‌ దక్కించుకుంది.

అతని నాయకత్వంలో భారత్ ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్-100లోకి ప్రవేశించింది. అతన్ని ‘కెప్టెన్ ఫెంటాస్టిక్’ అని కూడా పిలుస్తారు. ప్లేయర్‌గానూ అతను సాధించిన ఘనతలు ఎన్నో. భారత్ తరపున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు అతనిపేరిటే ఉంది. మార్చిలో ఆఫ్ఘనిస్తాన్‌పై 150 మ్యాచ్ ఆడాడు. భారత్ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడింది కూడా అతనే. 150 మ్యాచ్‌ల్లో 94 గోల్స్ చేశాడు. ప్రస్తుత తరంలో క్రిస్టియానో రొనాల్డో(128), మెస్సీ(106) తర్వాత అత్యధిక గోల్స్ చేసింది ఛెత్రినే. మొత్తంగా నాలుగో స్థానం. 2011లో ఛెత్రి అర్జున అవార్డు, 2019లో పద్మ శ్రీ అవార్డు అందుకున్నాడు. 2021లో ఖేల్ రత్న అవార్డు వరించింది. అత్యున్నత క్రీడా పురస్కారం అందుకున్న తొలి ఫుట్‌బాలర్ అతనే.

పుట్టింది హైదరాబాద్‌లోనే

సునీల్ ఛెత్రికి హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. అతను పుట్టింది సికింద్రాబాద్‌లోనే. 1984లో ఆగస్టు 3న కె.బి ఛెత్రి, సుశీల ఛెత్రి దంపతులకు సునీల్ ఛెత్రి జన్మించాడు. కె.బి. ఛెత్రి ఇండియన్ ఆర్మీకి చెందిన ఈఎంఈ కార్ప్స్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈఎంఈ కార్ప్స్‌ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్‌లోనే ఉంది. సునీల్ ఛెత్రి తల్లి సుశీల ఛెత్రి కూడా ఫుట్‌బాల్ క్రీడాకారిణినే. నేపాల్ మహిళల జాతీయ జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహించింది.

Advertisement

Next Story

Most Viewed