పృథ్వీ షాకు షాక్.. వేటు వేసిన ముంబై

by Harish |
పృథ్వీ షాకు షాక్.. వేటు వేసిన ముంబై
X

దిశ, స్పోర్ట్స్ : భారత యువ బ్యాటర్ పృథ్వీ షాకు భారీ షాక్ తగిలింది. రంజీ ట్రోఫీలో ముంబైకి ఆడుతున్న అతన్ని త్రిపురతో జరగబోయే మ్యాచ్‌ నుంచి తప్పించారు. అతన్ని పక్కనపెట్టడానికి గల కారణాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ వెల్లడించలేదు. టోర్నీలో గత రెండు మ్యాచ్‌ల్లోనూ అతను ఆకట్టుకోలేదు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 59 పరుగులే చేశాడు. అతనిపై వేటు వేయడానికి ఫిట్‌నెస్, క్రమశిక్షణా రాహిత్యమే కారణమని తెలుస్తోంది. ట్రైనింగ్ సెషన్‌కు పృథ్వీ షా రెగ్యులర్‌గా హాజరు కాలేదని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. రెండు వారాలపాటు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలని అతనికి సూచించినట్టు పేర్కొంది. త్రిపురతో మ్యాచ్‌కు పృథ్వీ షా స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్ అఖిల్ హెర్వాడ్కర్‌ను తీసుకుంది. అలాగే, స్పిన్నర్ తనూష్ కొటియన్ ఆస్ట్రేలియా టూరుకు కోసం భారత ‘ఏ’ జట్టుకు ఎంపిక కావడంతో అతని స్థానంలో స్పిన్నర్ కర్ష్ కొఠారి‌కి చోటు దక్కింది. ఈ నెల 26 నుంచి 29 వరకు ముంబై, త్రిపుర జట్ల మధ్య మూడో రౌండ్ మ్యాచ్ జరగనుంది.

Advertisement

Next Story