మరోసారి తిప్పేసిన త్యాగరాజన్.. రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు హైదరాబాద్

by Harish |
మరోసారి తిప్పేసిన త్యాగరాజన్.. రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు హైదరాబాద్
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ‌ ప్లేట్ గ్రూపులో హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో నాగాలాండ్‌పై ఆదివారం ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. తనయ్ త్యాగరాజన్(6/81) మరోసారి విజృంభించడంతో హైదరాబాద్‌ కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఫాలో ఆన్ ఆడిన నాగాలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 20/1తో ఆదివారం ఆట కొనసాగించిన ఆ జట్టు బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ తేలిపోయారు. సుమిత్ కుమార్(86), సెడెజాలీ రూపెరో(59) రాణించగా.. మిగతా వారు క్రీజులో నిలువలేకపోయారు. మరోసారి తనయ్ త్యాగరాజన్ స్పిన్‌ ఉచ్చులో చిక్కుకుని వికెట్లు పారేసుకున్నారు. త్యాగరాజన్ 6 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. కెప్టెన్ తిలక్ వర్మ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌ను హైదరాబాద్ 462/8 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇవ్వగా.. నాగాలాండ్ 206 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 13 వికెట్లు తీసిన తనయ్ త్యాగరాజన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ నెల 12 నుంచి 21 వరకు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో మేఘాలయను హైదరాబాద్ ఢీకొట్టనుంది. అంతేకాకుండా, ఫైనల్‌కు చేరుకోవడంతో హైదరాబాద్ తిరిగి రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో చోటు దక్కించుకుంది. వచ్చే సీజన్‌లో హైదరాబాద్ ఎలైట్ గ్రూపులో ఆడనుంది.

Next Story

Most Viewed