టీమ్ ఇండియాతో టీ20 సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన..

by Vinod kumar |
టీమ్ ఇండియాతో టీ20 సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన..
X

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : టీమ్ ఇండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఖరారైంది. రోవ్మాన్ పొవెల్ నాయకత్వంలో 15 మంది కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిపెట్టుకుని జట్టును ఎంపిక చేసినట్టు లీడ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ తెలిపారు.

వికెట్ కీపర్ షాయ్ హోప్, పేసర్ ఓషనె థామస్ తిరిగి టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. వన్డే కెప్టెన్‌గా కొనసాగుతున్న షాయ్ హోప్ గతేడాది ఫిబ్రవరిలో చివరి టీ20 ఆడాడు. అలాగే, బౌలర్ థామస్ 2021 డిసెంబర్‌లో చివరి టీ20 మ్యాచ్‌లో పాల్గొన్నాడు. భారత్‌తో టీ20 సిరీస్‌తో వీళ్లిద్దరూ తిరిగి జట్టులోకి వచ్చారు.

అలాగే, వన్డే మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చిన జాసన్ హోల్డర్ టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అమెరికాలో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ) టోర్నీతో టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన నికోలస్ పూరన్ టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో రావడంతో విండీస్ జట్టు బలం పెరిగిందనే చెప్పొచ్చు. ఎంఎల్‌సీ ఫైనల్ మ్యాచ్‌లో పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఎంఐ న్యూయార్క్‌ను ఒంటిచెత్తే గెలిపించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ గురువారం జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభంకానుంది.

వెస్టిండీస్ జట్టు :

రోవ్మాన్ పొవెల్(కెప్టెన్), కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, హెట్మేయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకెల్ హొసెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రొమారియో షెఫెర్డ్, ఓడియన్ స్మిత్, ఓషనె థామస్.

Advertisement

Next Story

Most Viewed