తొలి టెస్టు ఇంగ్లాండ్‌‌ కైవసం.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యం

by Harish |
తొలి టెస్టు ఇంగ్లాండ్‌‌ కైవసం.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యం
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో తొలి టెస్టు ఇంగ్లాండ్ కైవసమైంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శనివారం ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో రోజు మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టు మొదటి టెస్టును దక్కించుకుంది. నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 204/6‌తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన శ్రీలంక 326 పరుగులు చేసింది. కామిందు మెండిస్(113) సెంచరీ చేయగా.. చండీమాల్(79) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, క్రిస్ వోక్స్ మూడేసి వికెట్లతో సత్తాచాటారు.

అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 358 స్కోరు వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 122 పరుగుల ఆధిక్యం పోగా ఇంగ్లాండ్ 205 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. లక్ష్యాన్ని ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదటి 16 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ తడబడినప్పటికీ.. జో రూట్(62 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి హ్యారీ బ్రూక్(32), జేమీ స్మిత్(39) సహకారం తోడైంది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

Advertisement

Next Story

Most Viewed