ఫైనల్‌కు నలుగురు బాక్సర్లు

by Dishanational3 |
ఫైనల్‌కు నలుగురు బాక్సర్లు
X

దిశ, స్పోర్ట్స్ : కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నలుగురు భారత బాక్సర్లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. అండర్-22 పురుషుల విభాగంలో విశ్వనాథ్ సురేశ్(48 కేజీలు), నిఖిల్(57 కేజీలు), ఆకాశ్ గూర్ఖా(60 కేజీలు), ప్రీత్ మాలిక్(67 కేజీలు) స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. శనివారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో ప్రస్తుత యూత్ వరల్డ్ చాంపియన్ విశ్వనాథ్ 5-2 తేడాతో ఫిలిప్పీన్స్ బాక్సర్ బారిక్యూట్రో బ్రయాన్‌ను ఓడించగా.. ఆకాశ్ 5-0 తేడాతో ఇలియాసోవ్ సయాత్(ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించాడు. నిఖిల్ 5-0 తేడాతో గన్‌బోల్డ్(మంగోలియా)పై గెలుపొందగా.. ప్రీత్ మాలిక్ అంతే తేడాతో కిర్గిజ్‌స్తాన్‌కు చెందిన అల్మాజ్‌ను చిత్తు చేశాడు. మరోవైపు, జాదుమణి సింగ్(51 కేజీలు), అజయ్ కుమార్(63.5 కేజీలు), అంకుష్(71 కేజీలు), ధ్రువ్ సింగ్(80 కేజీలు), జుగ్నూ(86 కేజీలు), యువరాజ్(92 కేజీలు) సెమీస్ బౌట్లలో ఓడి కాంస పతకంతో సరిపెట్టారు. మంగళవారం ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Next Story

Most Viewed