భారత్‌దే బోణీ.. బంగ్లాను చిత్తు చేసిన మహిళల జట్టు

by Dishanational3 |
భారత్‌దే బోణీ.. బంగ్లాను చిత్తు చేసిన మహిళల జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఐదు టీ20ల సిరీస్‌ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళల క్రికెట్ జట్టు సిరీస్‌లో శుభారంభం చేసింది. సిల్హెట్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌‌పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. స్మృతి మంధాన(9) నిరాశపర్చినా.. యాస్తికా భాటియా(36), షెఫాలీ వర్మ(31), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(30) సత్తాచాటారు. రిచా గోష్(23) విలువైన పరుగులు జోడించడంతో జట్టు పోరాడే స్కోరు సాధించింది. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్(3/23) సత్తాచాటింది.

అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో బంగ్లాదేశ్ 101/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ నిగర్ సుల్తానా(51) హాఫ్ సెంచరీతో రాణించినా.. మిగతా వారు భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలువలేకపోయారు. రేణుక సింగ్(3/18), పూజా వస్త్రాకర్(2/25) తమ పేస్‌తో బంగ్లా పతనాన్ని శాసించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, రాధా యాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది. మంగళవారం రెండో టీ20 జరగనుంది.



Next Story