Asia Cup 2023: మెగా టోర్నీకి ముందు ‘మినీ’ యుద్ధం.. ఈసారి ఆసియా కప్ ​ఎవరికి దక్కనుందో?

by Vinod kumar |   ( Updated:2023-08-29 12:05:10.0  )
Asia Cup 2023: మెగా టోర్నీకి ముందు ‘మినీ’ యుద్ధం.. ఈసారి ఆసియా కప్ ​ఎవరికి దక్కనుందో?
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్‌ భారీ టోర్నీకి ముందు సన్నాహకంగా ఓ మినీ టోర్నమెంట్ సిద్ధమైంది. ఆసియాకు చెందిన ఆరు దేశాలు తలపడే ‘ఆసియా కప్’ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంక, పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ - నేపాల్‌ తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. గ్రూప్‌ దశలో సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్‌తోను, సెప్టెంబర్‌ 4న నేపాల్‌తోనూ భారత్‌ పోటీపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు భారత్‌ జట్టుకు కేఎల్​రాహుల్ దూరమయ్యాడు. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా దాదాపు నాలుగు స్టేడియంలో ఆసియా కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లోని ముల్తాన్‌, లాహోర్‌తో పాటు శ్రీలంకలో పల్లెకెల్లె, కొలొంబో స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక ఈ మెగా టోర్నీ కోసం బెంగళూర్‌లో టీమ్​ఇండియా ముమ్మరంగా సాధన చేసింది.

అయితే ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌.. ఇప్పుడు మళ్లీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలుచుకోగా.. ఇప్పటి వరకు భారత్‌ అత్యధికంగా 7 సార్లు ఆసియాకప్‌లో విజేతగా నిలిచింది. దీంతో ఈసారి కూడా నాలుగు జట్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. భారత్‌, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ రేసులో ఉన్నాయి.

భారత్‌, పాకిస్థాన్​, నేపాల్‌ గ్రూప్‌-ఏలో, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. రోహిత్‌శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఈ టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. గాయం కారణంగా పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరంకానున్న విషయం తెలిసిందే. ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed