మార్కెట్లకు 'రంగు' పడింది!

by  |
మార్కెట్లకు రంగు పడింది!
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందనే సంకేతాలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీ పతనాలను చవిచూశాయి. దీనికి తోడు సౌదీ అరేబియా చమురు ధరలను భారీగా తగ్గించి, ఏప్రిల్‌లో ముడి చమురు ఉత్పత్తిని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంతో చమురు ధరలు 31 శాతం పడిపోయాయి. ఇది చరిత్రలోనే అతిపెద్ద పతనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. మార్కెట్లోని అన్ని రంగాలు దారుణంగా పడిపోయాయి. మెటల్ రంగం అత్యధికంగా 5.6 శాతం పడిపోగా, మీడియా రంగం 5.4 శాతం క్షీణించింది. బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక రంగాలు 4 నుంచి 5 శాతం వరకూ పడిపోయాయి. రియల్టీ, ఎనర్జీ, ఆటో రంగాలు 3 శాతం మేర తగ్గాయి. ఫార్మా, ఎఫ్ఎమ్‌సీజీ రంగాలు 2 నుంచి 3 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఈ ఏడాది హోళీ రోజున మార్కెట్లకు రంగు పడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1941.67 పాయింట్ల నష్టంతో 35,634 వద్ద క్లోజయింది. నిఫ్టీ 538 పాయింట్లను కోల్పోయి 10,451 వద్ద ముగిసింది. లంచ్ సమయంలో మార్కెట్లు రికార్డు స్థాయిలో 2400 పాయింట్ల వరకూ పతనమయ్యాయి. మార్కెట్లు ఆ స్థాయిలో పతనమవడం చూసి పెట్టుబడిదారులు భయంతో వణికిపోయారు. ఒకవైపు ప్రపంచ మార్కెట్లు, ఆసియా మార్కెట్ల పతనం, మరోవైపు దేశీయంగా మాంద్యం మొదలుకొని యెస్ బ్యాంక్ సంక్షోభం వరకూ అన్ని రకాలుగా కుదేలవడంతో మార్కెట్లు భారీ పతనాన్ని చూడవలసి వచ్చింది.

అంతర్జాతీయంగా మార్కెట్లు నష్టాలను ఎదుర్కోడానికి ప్రధానంగా చమురు ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా, రష్య దేశాల మధ్య గొడవలు మొదలవడం. చమురు ధరలను తగ్గించేందుకు రష్యా ససేమిరా అనడంతో మిగిలిన ఒపెక్ దేశాలు రష్యాను దెబ్బ కొట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో చమురు ధరలు 30 శాతం తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే విషయమే అయినా మార్కెట్ల పతనాన్ని మాత్రం కాపాడలేకపోయాయి. చమురు రంగంలోని రిలయన్స్, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు 15 శాతం వరకూ క్షీణించాయి.

మరోవైపు, యెస్ బ్యాంక్ సంక్షోభంతో విదేశీ మదుపర్లు దేశ ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు మొదలయ్యాయి. విదేశీ మదుపర్లు గత 15 సెషన్ల నుంచి అమ్మకాలకు సిద్ధపడ్డారు. వీరి నిర్ణయంతో మార్కెట్లో రూ. 21 ,937 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉపసంహరణ జరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కుప్పకూలడంతో పెట్టుబడిదారులు మధ్యాహ్నానికి రూ. 7.72 లక్షల కోట్ల వరకూ కోల్పోయారు. కరోనా వైరస్ ఆందోళనలు పెరుగుతుండటంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ. 136.59 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ ఏకంగా 2400 పాయింట్ల వరకూ పతనాన్ని చూసింది. నిఫ్టీ 6 శాతం మేర దిగజారింది. దేశీయ సూచీలు విపరీతమైన అమ్మకపు ఒత్తిడిని చూడ్డంతో నిఫ్టీ 6 శాతం క్షీణించింది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market, petrol price, yes bank crisis, market capitalization


Next Story

Most Viewed