రాజస్తాన్ సర్కారుకు ఊరట

by  |
రాజస్తాన్ సర్కారుకు ఊరట
X

జైపూర్: రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనానికి సంబంధించిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. దీంతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో కాంగ్రెస్ సర్కారుకు కాస్త ఊరట లభించినట్టయింది. ఆ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొనసాగకుండా స్టే ఇవ్వాలన్న బీజేపీ, బీఎస్పీ నేతల అభ్యర్థనను సింగిల్ జడ్జ్ బెంచ్ నిరాకరించింది.

ఈ పిటిషన్‌పై ఈ నెల 11లోపు స్పందించాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్, సెక్రెటరీలతోపాటు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు గతనెల 30న నోటీసులు పంపింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్, బీఎస్పీ నేషనల్ సెక్రెటరీ సతీష్ మిశ్రాలు సింగిల్ జడ్జ్ బెంచ్‌కు వ్యతిరేకంగా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ తోసిపుచ్చుతూ బీఎస్పీ, బీజేపీ నేతల స్టే అప్లికేషన్‌ను సింగిల్ జడ్జ్ ధర్మాసనమే 11న విచారిస్తుందని పేర్కొంది.

గతేడాది సెప్టెంబర్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజా తీర్పుతో మెజార్టీ కన్నా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్న అశోక్ గెహ్లాట్ సర్కారుకు ఊరటనిస్తున్నది. బలనిరూపణకు అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్కారు ఊపిరిపీల్చుకుంది.


Next Story

Most Viewed