'ఆన్‌లైన్' పాఠాలకు యూనిఫాం ఒత్తిడి

by Shyam |
ఆన్‌లైన్ పాఠాలకు యూనిఫాం ఒత్తిడి
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే వణికిపోతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. విద్యా సంస్థలు బందయ్యాయి. పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఒకేచోట గుమిగూడడంపై నిషేధం ఉన్నందున ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నాయి. అయితే విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫామ్ ధరించాలని యాజమాన్యం ఆదేశించింది. కానీ యూనిఫాం ధరించాలంటూ వారిపై ఒత్తిడి తేవద్దని జిల్లా విద్యాశాఖాధికారులు స్పష్టం చేశారు. యాజమాన్యం ఒక రకమైన నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మరో రకంగా ఆదేశాలు జారీ చేస్తోంది. మధ్యలో పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారు.

యూనిఫాం తప్పనిసరి!

కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఎలాంటి వార్షిక పరీక్షలు నిర్వహించరాదని, ఆ తర్వాత క్లాస్ కు ప్రమోట్ చేస్తున్నట్టు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం 1897 విపత్తుల చట్టం అమల్లో ఉన్నందున ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలని మరీ చెప్పింది. అయినా ప్రైవేటు సంస్థలు విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాయి. కంప్యూటర్ ముందో, సెల్ ఫోన్ ముందో ఆన్‌లైన్ క్లాస్‌లో ఉన్నప్పుడు కచ్చితంగా స్కూల్ యూనిఫామ్ ధరించాలని విద్యార్థులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. విద్యార్థుల ఇండ్లకు హోం వర్క్ షీట్స్ పంపిస్తూ కచ్చితంగా వర్క్ పూర్తి చేయాలంటున్నారు. లేదంటే, తర్వాత క్లాసుకు ప్రమోట్ చేసేది లేదంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నాయి.

ఆన్‌లైన్ క్లాస్ పేరుతో ప్రైవేటు పాఠశాలల సిబ్బంది విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంలో పనిలో పనిగా తల్లిదండ్రులతోనూ మాట్లాడుతున్నారు. బకాయి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా రాంనగర్ సెయింట్ పాయిస్, హిమాయత్‌నగర్ నారాయణ పాఠశాలల్లో చోటు చేసుకున్న ఈ అంశాలను బాలల హక్కుల సంఘం జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ప్రైవేటు యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును బాలల హక్కల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని, ఇది కచ్చితంగా బాలల హక్కులకు భంగకరం అంటూ జిల్లా విద్యాశాఖ అధికారి బి.వెంకటనర్సమ్మకు ఫిర్యాదు చేశారు.

చర్యలు తీసుకుంటాం – డీఈవో వెంకటనర్సమ్మ

ఆన్‌లైన్ పాఠాలు చెప్పుకుంటామంటే పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ, కంప్యూటర్ ముందు కచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి, జనగణమన పాడాలి అంటే అది ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడమే అవుతుంది. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ప్రభుత్వ సడలింపులు ఉన్నాయి. ఫీజులు విషయంలోనూ ఒత్తిడి చేయొద్దు. బాలల హక్కుల సంఘం చేసిన ఫిర్యాదును పరిశీలిస్తాం. ఫిర్యాదులో పేర్కొన్నట్టు నిజాలు వెల్లడైతే ఆ పాఠశాలలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

tags: Corona Effect, Online Classes with School Uniform, Hyderabad Deo, Child Rights Commission

Next Story

Most Viewed