థర్డ్‌వేవ్ ఎఫెక్ట్ : స్కూళ్లకు ఆన్‌లైన్, కాలేజీలకు ఆఫ్‌లైన్ తరగతులు

by Shyam |
థర్డ్‌వేవ్ ఎఫెక్ట్ : స్కూళ్లకు ఆన్‌లైన్, కాలేజీలకు ఆఫ్‌లైన్ తరగతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆన్‌లైన్‌లో పాఠశాలలను, ఆఫ్‌లైన్‌లో కళాశాలల తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 1 నుంచి పాఠశాలల్లో 50 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే హాజరుకావాలని సూచించింది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగానే ప్రభుత్వం నిర్ణయాలను మార్చుకుంది. విద్యార్థులను వైరస్ నుంచి కాపాడేందుకే తిరిగి ఆన్ లైన్ క్లాసులనే నిర్వహించనుంది.

9,10 తరగతులకు ఆన్ లైన్ పాఠాలు..

విద్యాసంస్థలు ప్రారంభం కాకముందే ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకుంది. పాఠశాలల నుంచి కళాశాలల వరకు అన్ని తరగతులను ప్రారంభించాలని సన్నద్ధమైన ప్రభుత్వం పరిస్థితుల దృష్ట్యా నిర్ణయాలను వెనక్కు తీసుకుంది. గతేడాది మాదిరిగానే కేవలం 9,10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఆన్ లైన్‌లో తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఇతర ఉన్నత విద్యా తరగతులన్నీ ఆఫ్ లైన్‌లోనే నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. పాఠశాలల్లో 50 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే తరగతులకు హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని. టీచర్ల బదిలీలను, ప్రమోషన్లను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు.

డెల్టా ప్లస్ వేరింయట్ ముప్పుతో జాగ్రత్తలు..

డెల్టా ప్లస్ వేరియంట్‌తో ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ నుంచి విద్యార్థులను కాపాడేందుకే ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్రతపై ప్రపపచ దేశాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. ఈ వైరస్ తో ఊహించని స్థాయిలో ముప్పు ఉంటుందని, మాస్కు లేకుండా కరోనా పాజిటివ్ వ్యక్తి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లినా.. కరోనా సోకుతుందనే ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపైనే అధికంగా ఉంటుందనే ప్రచారం లేకపోలేదు. దీంతో తల్లిదండ్రుల్లోనూ భయాందోళనలు చోటుచేసుకున్నాయి. వీటన్నిటినీ పరిగిణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆన్‌లైన్ తరగతులకే మొగ్గు చూపింది.

Next Story

Most Viewed