వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి

by Anukaran |
వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి
X

దిశ, అశ్వారావుపేట : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారులోని జల్లేరు వాగులో అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ప్రయాణికులతో వస్తున్న జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జల్లేరు వాగు దగ్గరికి వచ్చే సరికి అదుపుతప్పి వాగుపై ఉన్న రైలింగ్‌ను ఢీకొని వాగులో పడిపోయింది. వెంటనే స్థానికులు పడవల సహాయంతో బస్సులోని పలువురిని రక్షించారు. ఆర్టీసీ బస్సు వాగులో పడిన సమయంలో బస్సులో సుమారు 47 మంది ఉన్నట్లు సమాచారం. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మంగళవారం రాత్రి వేలేరుపాడులో రాత్రి అక్కడే ఆపేసి బుధవారం ఉదయం అక్కడి నుంచి భద్రాచలం వెళ్లింది. మరల అక్కడి నుంచి అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డిగూడెం వెళ్తుండగా జల్లేరు వాగులో బోల్తా పడింది. బస్సు వాగులో పడిన విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, ఫైర్ అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. వాగులో పడిన బస్సును భారీ క్రేన్ సహాయంతో బయటకు తీస్తున్నారు.

బస్సు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..

జల్లేరు వాగులో బస్సు బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్‌తో సహా ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Next Story