నవీన్‌ను నాలా మింగేసింది

by  |
నవీన్‌ను నాలా మింగేసింది
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్‌ నాలాలో గల్లంతైన నవీన్‌కుమార్ మృతదేహం లభ్యం అయ్యింది. తపోవన్ కాలనీలో స్కూటీపై వెళ్తూ నాలాలో కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని వెలికి తీశారు. భారీ వర్షం కారణంగా బాలాపూర్‌లోని 35ప్రాంతాల నీరు మినీ ట్యాంక్‌బండ్ సరూర్‌నగర్‌కు వస్తుండగా వరద ఉధృతిలో నవీన్‌కుమార్ కొట్టుకుపోయారు. స్థానికులు ఎంత కాపాడే ప్రయత్నం చేసినా కనిపించకుండా పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 20గంటలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించినప్పటికీ నవీన్ ప్రాణాలతో బయట పడలేకపోయాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మూడురోజుల క్రితం నేరేడ్‌మెట్ నాలాలో బాలిక మృతిచెందిన సంఘటన మరవక ముందే భాగ్యనగరంలో మరో విషాద సంఘటన చోటు చేసుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. రెండ్రోజులు భారీ వర్షాలు కురిస్తే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.



Next Story