గత 3-4 ఏళ్లలో 8కోట్ల ఉద్యోగాలు సృష్టించాం.. ప్రధాని నరేంద్ర మోడీ

by vinod kumar |
గత 3-4 ఏళ్లలో 8కోట్ల ఉద్యోగాలు సృష్టించాం.. ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: గత మూడు నాలుగేళ్లలో దేశంలో 8కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని, ఇటీవల ఆర్బీఐ వెల్లడించిన నివేదికలో ఈ విషయం వెల్లడైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ గణాంకాలు తప్పుడు కథనాలను వ్యాప్తి చేసేవారి నోర్లు మూయించాయని తెలిపారు. నకిలీ కథనాలను వ్యాప్తి చేసే వారు అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధికి శత్రువులని విమర్శించారు. ముంబైలోని గోరేగావ్ శివారులో రోడ్డు, రైల్వే, ఓడరేవు రంగాల్లో రూ. 29,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోరెగావ్‌లో జరిగిన సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఎన్డీయే మూడో దఫా పాలనను చిన్న, పెద్ద పెట్టుబడిదారులు ఉత్సాహంగా స్వాగతించారన్నారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ గత నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. దేశంలో స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పన అవసరమని, ఈ దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

‘ముంబైలో జీవన నాణ్యతను తీర్చి దిద్దడమే ఎన్డీయే ముఖ్య ఉద్దేశం. ముంబై చుట్టూ కనెక్టివిటీ మెరుగుపడుతోంది. ఇప్పటికే కోస్టల్ రోడ్డు, అటల్ సేతు నిర్మాణం పూర్తైంది. అటల్ సేతును అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ ప్రతి ఒక్కరూ దాని నుంచి ప్రస్తుతం ప్రయోజనం పొందుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘వికసిత్ భారత్ తయారీలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో పరిశ్రమ, వ్యవసాయం, ఆర్థిక రంగం బలమైన శక్తిని కలిగి ఉంది. మహారాష్ట్రను ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా మార్చడమే నా లక్ష్యం’ అని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు.



Next Story