ఎన్నికలను మేం నియంత్రించలేం.. వీవీప్యాట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
ఎన్నికలను మేం నియంత్రించలేం.. వీవీప్యాట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థ ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని, ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈవీఎం యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కౌంటింగ్ లో ఈవీఎం ఓట్లతో పాటు వీవీప్యాట్ స్లిప్ లను క్రాస్ వెరిఫై చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై రెండ్రోజుల పాటు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై ఇవాళ తీర్పు వెల్లడించడానికి కొన్ని గంటల ముందు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ అంశంలో తమకు ఇంతా సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈవీఎంలో మైక్రో కంట్రోలర్‌ ఎక్కడ ఉంటుంది? కంట్రోలింగ్‌ యూనిట్‌లోనా లేదా వీవీప్యాట్‌లో ఉంటుందా? మైక్రో కంట్రోలర్ ఒక సారి రూపొందించిన ప్రోగ్రామా కాదా? ఈ సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం ఈసీ అధికురులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఈ వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. మీ(పిటిషనర్ల) ఆలోచనా ధోరణిని మేం మార్చలేం. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. ఈ సందర్భంగా ఈవీఎం సోర్స్ కోడ్ కు సంబంధించిన పలు అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. అయితే సోర్స్ కోడ్ ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదని అది దుర్వినియోగం అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.



Next Story

Most Viewed