ఆహార వ్యర్థాలను సగానికి తగ్గిస్తే.. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో భారీ క్షీణత

by Harish |
ఆహార వ్యర్థాలను సగానికి తగ్గిస్తే.. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో భారీ క్షీణత
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించడం ద్వారా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో భారీ క్షీణత ఉంటుందని ఒక నివేదిక పేర్కొంది. UN ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మనుషుల అవసరాల కోసం ఉత్పత్తి అవుతున్న ఆహారంలో మూడింట ఒక వంతు వృధా అవుతుందని తెలిపింది. దీనిని అరికట్టడం ద్వారా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు నాలుగు శాతం తగ్గుతాయని, అలాగే, పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య 153 మిలియన్లకు తగ్గుతుందని నివేదిక పేర్కొంది.

పొలాల్లో పండిన పంటను దుకాణాలు, గృహాలకు తీసుకుపోయే మార్గంలో చాలా వరకు వృధా అవుతుంది. దీనిని కట్డడి చేయాలి, లేకపోతే 2033 నాటికి, ఇలా వృధా అయ్యే ఆహార ఉత్పత్తుల పరిమాణం, ప్రస్తుతం తక్కువ-ఆదాయ దేశాలలో ఒక సంవత్సరంలో వినియోగించే ఆహారం కంటే రెండింతలు ఎక్కువ ఉంటుందని ఆర్గనైజేషన్ నివేదిక తెలిపింది.

2030 నాటికి తలసరి ఆహార వ్యర్ధాలను 50 శాతం తగ్గించాలని UN దేశాలు కట్టుబడి ఉన్నాయి, అయితే ఉత్పత్తి అవుతున్న ఆహారాన్ని సరఫరా చేసే సమయంలో వస్తున్న నష్టాన్ని తగ్గించడానికి ఎలాంటి లక్ష్యాలు లేవని పేర్కొంది. ఆహార నష్టం, వ్యర్థాలను తగ్గించే చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని గణనీయంగా పెంచుతాయి, దీంతో ఎక్కువ ఆహారం అందుబాటులోకి వస్తుంది, ధరలు తగ్గుతాయి, తక్కువ-ఆదాయం కలిగిన జనాభాకు ఆహారాన్ని అందించడానికి వీలవుతుందని నివేదిక వెల్లడించింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030లో దాదాపు 600 మిలియన్ల మంది ప్రజలు ఆకలి బాధను ఎదుర్కొంటారని అంచనా వేసింది.

Next Story