ఇండోర్‌లో ముగ్గురు అనాథాశ్రమ పిల్లలు మృతి.. అధికారుల దర్యాప్తు

by Harish |
ఇండోర్‌లో ముగ్గురు అనాథాశ్రమ పిల్లలు మృతి.. అధికారుల దర్యాప్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బాలల అనాథాశ్రమానికి చెందిన ముగ్గురు చిన్నారులు గత రెండు రోజుల్లో చనిపోయారని అధికారులు మంగళవారం తెలిపారు. నగరంలోని మల్హర్‌గజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆశ్రమంలో అనాథలు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న 200 మందికి పైగా చిన్నారులు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఆశ్రమంలో 12 మంది పిల్లలకు వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే ఎంవైహెచ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పరిస్థితి విషమించడంతో వారిలో ముగ్గురు.. కరణ్ (12), ఆకాష్ (7), శుభ్ (8) సోమ, మంగళవారాల్లో మరణించారని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ) అలోక్ కుమార్ శర్మ తెలిపారు.

పిల్లల రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే దీనికి గల కారణాలను వైద్యులు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలంతా 14 ఏళ్లలోపు వారే. మృతి చెందిన పిల్లల పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఈ మరణాలకు ఖచ్చితమైన కారణం తెలుస్తుందని ఒక అధికారి తెలిపారు.

ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ఆదేశాల మేరకు వైద్యులు, ఆహార శాఖ అధికారులతో కూడిన ఒక బృందం ఇటీవల పిల్లల అనాథాశ్రమాన్ని సందర్శించింది. బృందానికి నాయకత్వం వహించిన అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర సింగ్ రఘువంశీ విలేకరులతో మాట్లాడుతూ, ఆశ్రమంలో ఉన్న 204 మంది పిల్లల్లో, గత 48 గంటల్లో ముగ్గురు మరణించారు. దీనిపై విచారణ జరుగుతుంది. విచారణలో డైరెక్టర్ల నిర్లక్ష్యం తేలితే తగిన చర్యలు తీసుకుంటామని, ఆశ్రమానికి అందించే ఆహారం, రేషన్‌కు సంబంధించిన నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

Next Story

Most Viewed