Robbery Training School: రూ.2 లక్షలు కడితే దొంగతనంలో ట్రైనింగ్.. సీటు దొరకడం అంత తేలిక కాదు

by Prasad Jukanti |
Robbery Training School: రూ.2 లక్షలు కడితే దొంగతనంలో ట్రైనింగ్.. సీటు దొరకడం అంత తేలిక కాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ పిల్లలు సన్మార్గంలో నడిచేందుకు, విద్యాబుద్ధులు నేర్చుకుని జీవితంలో స్థిరపడేందుకు తల్లిదండ్రులు మంచి స్కూళ్లలో చేర్పిస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే చోట మాత్రం విద్యాబుద్ధులకు బదులు చోరకళను నేర్పించేందుకు పేరెంట్స్ తమ పిల్లలను శిక్షణ కేంద్రాలలో చేర్పిస్తున్నారు. ఏడాదికి రూ.2 నుంచి 3 లక్షల వరకు ఫీజు చెల్లించి మరీ తమ పిల్లలను ఈ దొంగ బడులలో చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు చిన్న చిన్న దొంగతనాల నుంచి గజదొంగలుగా మారి భారీగా సంపాదిస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూళ్లకు పంపించేందుకు పోటీ పడుతున్నారు. పోలీసులకే మతిపోగెట్టేలా ఉన్న ఈ దొంగల శిక్షణ కేంద్రాలు మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

రూ.3 లక్షల ఖర్చుతో రూ.5 లక్షల సంపాదన:

ప్రతి గ్రామానికి ఏదో ఓ ప్రత్యేకత ఉన్నట్లుగానే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి 117 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న మారుమూల గ్రామాలైన కడియా, గుల్‌ఖేడి, హుల్‌ఖేడి గ్రామాలు నేరస్థులకు 'నర్సరీలు'లుగా దేశవ్యాప్తంగా అపఖ్యాతిని పొందాయి. ఈ గ్రామాలు పిల్లలకు దొంగతనం, దోపిడీ కళలలో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అంటే అలాంటి ఇలాంటి శిక్షణ కాదు. జేబు దొంగతనం, రద్దీగా ఉండే ప్రదేశాల్లో బ్యాగులు లాక్కోవడం, వేగంగా పరిగెత్తడం, పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు ఒక వేళ పట్టుబడితే దెబ్బలు తట్టుకోవడం ఎలా అనే విషయంలో నైపుణ్యాలను పిల్లలకు నూరిపోస్తున్నారు. 12 లేదా 13 ఏళ్ల వయసు కలిగిన పిల్లలను తమ తల్లిదండ్రులు శిక్షణ కోసం ఈ గ్రామాలకు పంపుతారు. మంచి చోరకళను నేర్పించే గురువును ఎంచుకుని అక్కడ రూ.2 నుంచి 3 లక్షల వరకు ఫీజు చెల్లించే శిక్షణకు కుదుర్చుతున్నారు. ఇక్కడ ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తయిన తర్వాత, పిల్లల తల్లిదండ్రులకు గ్యాంగ్ లీడర్లు ప్రతి ఏటా రూ.3 నుంచి 5 లక్షల వరకు డబ్బులు చెల్లించి వారి పిల్లలను చోరీల కోసం అద్దెకు తీసుకువెళ్తుంటారు. ఇలా వీరంతా క్రమంగా చోరీలలో అరి తేరీపోతుంటారు. దీంతో పోలీసులు, వారి అధికారంతో కూడా ఈ ప్రాంతంలో జాగ్రత్తగా అడుగులు వేస్తారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది.

హైదరాబాద్ వ్యాపారవేత్త కుమారుడి పెళ్లిలో చోరీ:

ఇక్కడ శిక్షణ పొందిన వారి చోరకళ ఎంత స్మార్ట్ గా ఉంటుందంటే చిన్న మైనర్ బాలుడు చాకచక్యంగా విలువైన వస్తువులను ఎత్తు కెల్ల కలిగేలా ఉంటుంది. ఇటీవల ఆగస్టు 8న జైపూర్ లోని హయత్ హోటల్ లో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారిడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లిలో ఓ మైనర్ దొంగ కోటిన్నర విలువైన వజ్రాల నగలు, లక్ష నగదు కలిగిన బ్యాగ్ ను ఎత్తుకెళ్లడం దొంగతనంలో వీరికున్న చేతివాటం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగల ముఠా రాజ్‌గఢ్ జిల్లాలోని కడియా గ్రామానికి పారిపోయింది. అనుమానం రాకుండా ఉండేందుకు, వారు దొంగిలించిన నగలను త్వరగా పారవేసి, మతపరమైన తీర్థయాత్ర అయిన కన్వర్ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేసారు. కానీ పోలీసులు సీసీ టీవీని పరిశీలించి నేరుగా గ్రామానికి వెళ్లి ఈ చోరీకి పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసింది. మరో దొంగల ముఠా గత మార్చిలో గుర్గావ్ లో జరిగిన ఓ పెళ్లిలో నగల బ్యాగ్ ను తస్కరించింది. ఇక్కడ శిక్షణ పొందిన ముఠాలు ఇతర రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న నేపథ్యంలో దొంగతనం సమాచారం అందిన వెంటనే ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed