రూ. 86 లక్షల విలువైన బంగారు కడ్డీల పట్టివేత..

by Vinod kumar |
రూ. 86 లక్షల విలువైన బంగారు కడ్డీల పట్టివేత..
X

న్యూఢిల్లీ: రూ.86 లక్షల విలువైన 12 బంగారు బిస్కెట్లను పురీషనాళంలో దాచుకున్న స్మగ్లర్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఆదివారం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో పట్టుకుంది. ఇతను బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్‌లోని హకీంపూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ వద్ద జవాన్లు అతడిని పట్టుకున్నారు. 1.397 కిలోల బరువున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.86,04,659 ఉంటుంది. పట్టుబడిన స్మగ్లర్‌ను బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని హకీంపూర్ గ్రామానికి చెందిన 56 ఏళ్ల మైనూర్ ఖాన్‌గా గుర్తించారు.

బంగ్లాదేశ్‌ సత్‌ఖిరా జిల్లాకు చెందిన సహజుల్ మే 26వ తేదీన తన ఇంటికి వచ్చి 6 ప్యాకెట్లలో 12 బంగారు బిస్కెట్లను ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది. బసిర్‌హత్‌లోని ఓ వ్యక్తికి ఈ బంగారు బిస్కెట్లను అందజేసే పనిని మైనూర్‌కు అప్పజెప్పారు. ఇందుకు రూ. 1300 ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ, హకీంపూర్ చెక్ పోస్ట్ వద్ద అతను పట్టుపడ్డాడు. తక్కువ మొత్తంలో డబ్బుకోసం సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో నివసించే గ్రామస్తులు తరచూ ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు.

Advertisement

Next Story

Most Viewed