Delhi Pollution : ఢిల్లీ వాయు కాలుష్యం.. కేంద్ర గాలి నాణ్యతా కమిటీపై సుప్రీంకోర్టు భగ్గు

by Hajipasha |
Delhi Pollution : ఢిల్లీ వాయు కాలుష్యం.. కేంద్ర గాలి నాణ్యతా కమిటీపై సుప్రీంకోర్టు భగ్గు
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ చర్యలను చేపట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వ గాలి నాణ్యత కమిటీ సరిగ్గా స్పందించడం లేదని సుప్రీంకోర్టు మండిపడింది. ఢిల్లీలో గాలి నాణ్యతను కాపాడటంలో, వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో కమిటీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవిషయంలో పరిస్థితిని సమీక్షించేందుకు కనీసం ఒక్క ఉప కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వ గాలి నాణ్యత కమిటీ ఏర్పాటు చేయలేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘పంటల వ్యర్థాలను ఏటా ఢిల్లీ చుట్టూ యథేచ్ఛగా దహనం చేస్తున్నాారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) చట్టం ప్రకారం అలాంటి వాటిపై ఇప్పటిదాకా చర్యలు చేపట్టలేేదు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు తీసుకున్న కనీసం ఒక్క చర్య గురించి మాకు చెప్పండి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ ఈసందర్భంగా ప్రశ్నించింది.

దీనికి ఎయిర్ క్వాలిటీ కమిటీ ఛైర్‌పర్సన్ బదులిస్తూ.. ‘‘మూడు ఉప కమిటీలను ఏర్పాటు చేశాం. అవి మూడునెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తున్నాయి’’ అని చెప్పారు. సుప్రీంకోర్టు బెంచ్ స్పందిస్తూ.. ‘‘మూడు నెలలకోసారి ఉప కమిటీలు సమావేశమవుతాయని వింటేనే ఆశ్చర్యమేస్తోంది. ఇలా సమావేశమైతే వాయుకాలుష్యం కట్టడిపై ఎలా పనిచేయగలుగుతాయి’’ అని పేర్కొంది. వాయు కాలుష్య కట్టడికి ఏర్పాటు చేసిన ఉప కమిటీల సమావేశాల్లో చర్చించే వివరాలను నమోదు చేయాలని కేంద్ర గాలి నాణ్యత కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది. దేశ రాజధానిలో కాలుష్యం కలిగించే యూనిట్లను మూసివేసే అధికారాన్ని అవసరమైతే వాడుకోవాలని నిర్దేశించింది.

Advertisement

Next Story