Khadi : ఆగస్టు 7న ఖాదీ దుస్తులను కొనండి.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు

by Hajipasha |   ( Updated:2024-07-28 14:51:20.0  )
Khadi : ఆగస్టు 7న ఖాదీ దుస్తులను కొనండి.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ  పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో చేనేత, ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరిగాయని.. ఈ పరిణామంతో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ రంగాల్లో చోటుచేసుకుంటున్న పురోగతితో ప్రధానంగా మహిళలకే ప్రయోజనం దక్కుతోందని ఆయన పేర్కొన్నారు.ఆదివారం రోజు 112వ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లు దాటిందన్నారు. ఖాదీ విక్రయాలు 400 శాతం పెరిగాయని చెప్పారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు.

‘‘హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో 250 మందికిపైగా మహిళలు చేనేత ఉత్పత్తులు తయారు చేస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఉన్నతి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో చేరాక వారి జీవితాలు మారాయి. అధునాతన టెక్నాలజీతో చేనేత పనులు చేయడంపై శిక్షణ పొందాక వారు బెడ్ కవర్స్, సారీలు, దుపట్టాలు తయారు చేస్తూ భారీగా ఆదాయాలు ఆర్జిస్తున్నారు’’ అని చేనేత రంగానికి సంబంధించిన ఒక కేస్ స్టడీని ప్రధాని వివరించారు. ‘‘ఒడిశాకు చెందిన సంబల్ పురి సారీ, కశ్మీర్‌కు చెందిన కానీ షాల్స్, మధ్యప్రదేశ్‌కు చెందిన మహేశ్వరీ సారీలు హ్యాండ్లూమ్ ప్రపంచంలో ఎంతో పేరును గడించాయి’’ అని మోడీ గుర్తు చేశారు. ప్రజా కళలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ప్రాజెక్ట్ ‘పరీ’ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రోడ్ల పక్కన, గోడలపై కళాకారులు వేసే అద్భుతమైన పెయింటింగ్స్ పబ్లిక్ ప్లేసులను మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నాయని ప్రధాని కొనియాడారు.

Advertisement

Next Story