దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కుటుంబాన్ని కలుసుకున్న రాహుల్ గాంధీ

by Harish |
దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కుటుంబాన్ని కలుసుకున్న రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కుటుంబాన్ని కలుసుకున్నారు. గతంలో రాహుల్‌ను కలవాలనే కోరికను అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు వ్యక్తం చేయగా, మంగళవారం రాయ్‌బరేలీకి వచ్చిన రాహుల్ దివంగత కెప్టెన్ తండ్రి రవి ప్రతాప్ సింగ్, తల్లి మంజు సింగ్‌ను కలుసుకున్నారు. అనంతరం మంజు సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ, భారత సైన్యంలో తాత్కాలిక రిక్రూట్‌మెంట్లకు ఉద్దేశించిన అగ్నివీర్ పథకాన్ని నిలిపివేయాలని కేంద్రానికి అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు సైనిక సేవలు అందించడం అనేది సరైనది కాదు, పెన్షన్, క్యాంటీన్, సైనికుడికి అందించిన ప్రతి ఇతర సౌకర్యాన్ని కొనసాగించాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

గతేడాది జులై 19 వ తేదీన సియాచిన్ బేస్‌ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న జవాన్లను అన్షుమాన్ సింగ్ కాపాడారు, ఈ క్రమంలో ఆయనకు మంటలు అంటుకోగా తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. అసాధారణమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి అనేక మంది ప్రాణాలను కాపాడి నందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను మరణానంతరం కీర్తి చక్రతో సత్కరించారు.

ఇదిలా ఉంటే, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి. రాయ్‌బరేలీకి చేరుకున్న తర్వాత,రాహుల్ మొదట బచ్రావాన్‌లోని ఒక ఆలయంలో ప్రార్థనలు చేసి, ఆపై భూమా అతిథి గృహానికి వెళ్లారు, అక్కడ పార్టీ నాయకులు, స్థానికులను కలుసుకున్నారు.

Advertisement

Next Story