Jan Suraaj : ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీ.. అక్టోబరు 2న ‘జన్ సురాజ్’‌ ఆవిర్భావం

by Hajipasha |
Jan Suraaj : ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీ.. అక్టోబరు 2న ‘జన్ సురాజ్’‌ ఆవిర్భావం
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2022 సంవత్సరం నుంచి బిహార్‌లో తాను నిర్వహిస్తున్న ప్రజా చైతన్య సంస్థ ‘జన్ సురాజ్’‌ను రాజకీయ పార్టీగా మారుస్తానని ఆయన ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న ‘జన్ సురాజ్’ రాజకీయ పార్టీగా అవతరిస్తుందని పీకే వెల్లడించారు. వచ్చే ఏడాది(2025లో) బిహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఆదివారం పాట్నాలో జరిగిన జన్ సురాజ్ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో ఈవివరాలను ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. తమ పార్టీ నాయకత్వం, ఇతర వివరాలపై తగిన సమయంలో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ఢీకొట్టడమే తన టార్గెట్ అని పీకే స్పష్టం చేశారు.

ఈ వర్క్‌షాప్‌లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరీ ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. వాస్తవానికి గత రెండేళ్లుగా జన్ సురాజ్ ఉద్యమ సంస్థలో జాగృతి క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. జాగృతి ఠాకూర్ అన్నయ్య రాంనాథ్ ఠాకూర్ ప్రస్తుతం జేడీయూ ఎంపీగా ఉన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. జన్ సురాజ్‌ సంస్థ కార్యకలాపాల్లో ఇప్పటివరకు పాల్గొంటూ వస్తున్న కీలక నేతలలో ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రాంబాలి సింగ్ చంద్రవంశీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed