Pm modi: కాంగ్రెస్ దేశాన్ని విభజిస్తోంది.. ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు

by vinod kumar |
Pm modi: కాంగ్రెస్ దేశాన్ని విభజిస్తోంది.. ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ముస్లింల మనసుల్లో భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు. అది ఒక బాధ్యతారహితమైన పార్టీ అని, హిందువులను విభజించి, ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటోందని ఆరోపించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేసే ఫ్యాక్టరీలా కాంగ్రెస్ తయారైందని మండిపడ్డారు. మహారాష్ట్రలో రూ. 7,600 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. హిందువులు ఎంతగా చీలిపోతే అంత లాభపడుతుందని కాంగ్రెస్‌కు తెలుసని అందుకే దేశమంతా విధ్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ ముస్లింలలో భయాందోళనలు సృష్టిస్తోందని, వారిని తన ఓటు బ్యాంకుగా మార్చుకుంటోందన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళల అభివృద్ధితో కూడిన వికసిత భారత్ సాధించడమే బీజేపీ లక్ష్యమని వెల్లడించారు. ప్రాజెక్టుల వేగవంతమైన అభివృద్ధిని మహారాష్ట్ర గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో అంతా అవినీతిమయమైందని విమర్శించారు. ప్రస్తుతం అభివృద్ధిలో వేగం కనిపిస్తే వారి హయాంలో మాత్రం అవినీతి వేగంగా కనిపించిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ అధికారం కోసం మహారాష్ట్రను బలహీనపరచాలని కోరుకుంటోందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed