జీ7 సమ్మిట్‌కు ప్రధాని మోడీ పయనం.. జో బిడెన్‌తో చర్చలకు అవకాశం

by S Gopi |
జీ7 సమ్మిట్‌కు ప్రధాని మోడీ పయనం.. జో బిడెన్‌తో చర్చలకు అవకాశం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటలీకి పయనమయ్యారు. ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రారంభమైన జీ7 దేశాల వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇది ప్రధాని మోడీకి తొలి విదేశీ పర్యటన. ఈ సమ్మిట్‌లో యూఎస్, యూకే, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్‌తో పాటు యూరోపియన్ యూనియన్ పాల్గొననున్నాయి. జీ7 దేశాల చర్చల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్‌ సౌత్‌ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ సదస్సులో పాల్గొనే ఇతర నేతలతో భారత ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమ్మిట్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సహా జీ7 నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు, చర్చలు జరపాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. బుధవారం ప్రకటనలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ మాట్లాడుతూ.. ఇటలీలో జీ7 సమ్మిట్ సందర్భంగా బిడెన్, మోడీ ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. మోడీ పర్యటన ఖరారైతే బిడెన్ సమావేశంలో మోడీని కలవాలని ఆశిస్తున్నారని జేక్ సలివన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed