Mamata Banerjee : డాక్టర్లు నన్ను అవమానించారు.. రెండు గంటలు ఎదురుచూసినా చర్చలకు రాలేదు :సీఎం మమత

by Hajipasha |
Mamata Banerjee : డాక్టర్లు నన్ను అవమానించారు.. రెండు గంటలు ఎదురుచూసినా చర్చలకు రాలేదు :సీఎం మమత
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న సీఎం మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లిన సీఎం మమత.. అక్కడ నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. వారిని చర్చలకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు శనివారం సాయంత్రం వైద్యులు సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. ఓ వైపు వర్షపు జల్లులు కురుస్తున్నా.. సీఎం నివాసంలోకిి వెళ్లేందుకు జూనియర్ డాక్టర్లు ససేమిరా అన్నారు. స్వయంగా సీఎం మమత వచ్చి ఆహ్వానించినా వారు లోపలికి వెళ్లలేదు. చర్చల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అంగీకరిస్తేనే తాము నివాసంలోకి వస్తామని డాక్టర్లు తేల్చి చెప్పారు. ‘‘ఒకవేళ లైవ్ స్ట్రీమింగ్ లేకుండా చర్చలకు సిద్ధంగా లేకుంటే.. కనీసం నా నివాసంలోకి వచ్చి టీ తాగండి. వర్షం తగ్గాక వెళ్లండి. మీరంతా వర్షంలో తడుస్తున్నారే కానీ.. సెక్యూరిటీ సిబ్బంది ఇస్తున్న గొడుగులను ఎందుకు తీసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు’’ అని మమత పేర్కొన్నారు.

‘‘జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున చర్చలను లైవ్ స్ట్రీమ్ చేయలేం. కావాలంటే చర్చలకు సంబంధించిన వివరాలతో కూడిన నోట్‌పై సంతకం చేసి ఇస్తాను’’ అని బెంగాల్ సీఎం స్పష్టం చేశారు. ‘‘ఈ చర్చల ప్రక్రియకు సంబంధించిన వీడియోను రాష్ట్ర ప్రభుత్వం రికార్డు చేస్తుంది. సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకున్నాక దాన్ని డాక్టర్లకు అందిస్తాం’’ అని మమత చెప్పారు. ఈవిధంగా జూనియర్ డాక్టర్లకు నచ్చజెప్పేందుకు సీఎం మమత చాలాసేపు ప్రయత్నించారు. అయినా వైద్యులు పట్టువీడలేదు. ఈనేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను దాదాపు 2 గంటల పాటు ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఎదురుచూశాను. అయినా వైద్యులు నివాసంలోకి వచ్చి చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధం కాలేదు. వాళ్లు నన్ను అవమానించారు’’ అని దీదీ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed