జమ్మూ కశ్మీర్‌లో పాక్ డ్రోన్: తరిమికొట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు

by samatah |
జమ్మూ కశ్మీర్‌లో పాక్ డ్రోన్: తరిమికొట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ ప్రవేశించింది. దీని కదలికలను గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తమై డ్రోన్ పైకి కాల్పులు జరిపారు. సుమారు 24 రౌండ్ల పాటు కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్ తిరిగి పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత రామ్‌ఘర్ సెక్టార్‌లోని నారాయణపూర్‌లో బీఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే డ్రోన్ ద్వారా ఎలాంటి ఆయుధాలు, డ్రగ్స్ కానీ జారవిడవలేదని తెలిపారు. కాగా, పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోనూ గతంలో డ్రోన్‌ను పట్టుకున్నారు. అందులో డ్రగ్స్, హెరాయిన్ ప్యాకెట్లను గుర్తించారు. అలాగే ఇటీవల తరన్ తరణ్ జిల్లాలోని కలియా గ్రామంలోని పొలంలో దెబ్బతిన్న డ్రోన్ స్వాధీనం చేసుకోగా.. దానిని చైనా తయారు చేసిన డీజేఐ మావిక్ 3 క్లాసిక్ గా గుర్తించారు. మరో ఘటనలో అమృత్‌సర్‌లోని హర్దో రతన్ గ్రామం పక్కనే ఉన్న పొలంలో 460 గ్రాముల బరువున్న హెరాయిన్ ప్యాకెట్, దానికి కట్టిన చిన్న టార్చ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed