Zadingi : పులిని చంపిన ధీర వనిత జాదింగికి ఏమైందంటే..

by Hajipasha |
Zadingi : పులిని చంపిన ధీర వనిత జాదింగికి ఏమైందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎదుట నిలబడింది పులి అని తెలిసినా ఆమె అదరలేదు.. బెదరలేదు !! పులి పంజా విసిరినా కొంచెం కూడా కదల్లేదు !! ఉన్నచోటే నిలబడి చేతిలో ఉన్న గొడ్డలితో పులిపై బలంగా ఒక్కవేటు వేసింది. ఆ దెబ్బకు పులి ఖేల్ ఖతమైంది. 1978 జూలై 3న అడవికి రాజైన పులిని అడవిలోనే ఓడించిన మిజోరాం ధీర వనిత, శౌర్యచక్ర పురస్కార గ్రహీత జాదింగి ఇక లేరు. 72 ఏళ్ల వయసులో పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతూ ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 2021 సంవత్సరంలో భర్త క్యాన్సర్‌తో చనిపోయిన మరుసటి నెలలోనే.. ఆమెకు కూడా క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. గత మూడేళ్లలో రెండు మేజర్ సర్జరీలు చేసినా జాదింగి ఆరోగ్యం కుదుటపడలేదు.

శనివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని దక్షిణ మిజోరంలోని లుంగ్లీ జిల్లాలో ఉన్న స్వగ్రామం బుర్‌పుయ్‌లో జాదింగి అంత్యక్రియలు జరిగాయి. ఆమెకు ఐదుగురు సంతానం ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్దుహోమ జాడింగి మృతికి సంతాపం తెలిపారు.ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, ధైర్యసాహసాలను ప్రదర్శించినందుకు 1980లో ఆమెకు శౌర్యచక్ర పురస్కారం లభించింది. ఆమె వీరోచిత గాథను చాలా సంవత్సరాల పాటు మిజోరాం ప్రాథమిక పాఠశాల సిలబస్‌లోని హిందీ పాఠాల్లో చేర్చి బోధించారు. జాదింగి చంపిన పులికి చెందిన మమ్మిఫైడ్ డెడ్ బాడీని మిజోరాం స్టేట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed