Kolkata Doctor Rape-Murder: పోలీసులు కేసుని ఛేదించకపోతే సీబీఐకి బదిలీ చేస్తాం

by Shamantha N |
Kolkata Doctor Rape-Murder: పోలీసులు కేసుని ఛేదించకపోతే సీబీఐకి బదిలీ చేస్తాం
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో మెడికో హత్యపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ఆగస్టు 18లోగా పోలీసులు ఈ కేసుని ఛేదించలేకపోతే.. సీబీఐకి సిఫారసు చేస్తామన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమైనది, దిగ్భ్రాంతికరమైనదని అన్నారు. "ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి డాగ్ స్క్వాడ్, వీడియో విభాగం, ఫోరెన్సిక్ విభాగాన్ని నియమించాం. ఆదివారం(ఆగస్టు 18) నాటికి కోల్‌కతా పోలీసులు కేసును ఛేదించలేకపోతే కేసుని సీబీఐకి బదిలీ చేస్తాం. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని వెంటనే శిక్షిస్తాం. కేసు విచారణ వేగవంతం చేయాలని కోరుకుంటున్నాం. న్యాయ ప్రక్రియ త్వరగా జరుగుతుంది. నర్సులు ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతికి గురిచేసింది” అని అన్నారు.

పోలీసుల కస్టడీలో నిందితుడు

ఆస్పత్రిలో ఎవరిదో ప్రమేయం ఉందని బాధితురాలి తల్లిదండ్రులు కూడా చెప్పారని పోలీసులకు తెలిపానని మమతా బెనర్జీ అన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ సహా పలువురిని సస్పెండ్ చేశామన్నారు. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు సివిక్ వాలంటీర్ సంజోయ్ రాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు 14 రోజుల కస్టడీ విధించారు. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ కలకత్తా హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం (ఆగస్టు 13) కోర్టులో విచారణ జరగనుంది.

Advertisement

Next Story