కేదార్ నాథ్ గోల్డ్ స్కాం.. శంకరాచార్యకు ఆలయ ట్రస్టు సవాల్

by Shamantha N |
కేదార్ నాథ్ గోల్డ్ స్కాం.. శంకరాచార్యకు ఆలయ ట్రస్టు సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేథార్‌నాథ్‌ ఆలయంలో గోల్డ్ స్కాం జరిగిందన్న ఆరోపణలపై ఆలయ కమిటీ బుధవారం స్పందించింది. కేదార్ నాథ్ లో 228 కిలోల బంగారం మాయమైందని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఆరోపించారు. ఈ ఆరోపణలపై బద్రీనాథ్‌-కేథార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఛైర్మన్‌ అజేంద్ర అజయ్‌ మాట్లాడుతూ.. శంకరాచర్యకు సవాల్ విసిరారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. “కేదార్‌నాథ్ ఆలయంపై ఆధ్యాత్మిక గురువు చేసిన ప్రకటన చాలా దురదృష్టకరం. నేను స్వామి అవిముక్తేశ్వరానందను గౌరవిస్తాను. కానీ, ఆయన రోజంతా ప్రెస్ కాన్ఫరెన్స్ లతోనే గడుపుతారు. వివాదాలు సృష్టిండచం, సంచలన వ్యాఖ్యలు చేయడం, వార్తల్లో ఉండటం స్వామి అవిముక్తేశ్వరానంద్ కు అలవాటు"అని అన్నారు. వాస్తవాలు, సాక్ష్యాలను వెలుగులోకి తీసుకురావాలని శంకరాచార్యకు సవాల్ విసిరారు. స్వామీజీ ప్రకటనలు చేసే కన్నా.. అధికారుల వద్దకు వెళ్లి సాక్ష్యాలు సమర్పించి విచారణకు డిమాండ్ చేయాల్సిందన్నారు. అధికారులను నమ్మకపోతే.. సుప్రీంకోర్టు, హైకోరుకు వెళ్లి పిల్ దాఖలు చేయాల్సిందన్నారు. ఆయన వద్ద నిజంగా ఆధారాలు ఉంటే దర్యాప్తును డిమాండ్ చేయాలన్నారు.

శంకరాచార్యది కాంగ్రెస్ అజెండా

కేదార్‌నాథ్‌పై స్వామీజీ వ్యాఖ్యలు మానుకోవాలని అజేంద్ర అన్నారు. కేదార్ నాథ్ ఆలయ గౌరవాన్ని దెబ్బతీసేలా పనిచేయడం మానుకోవాలన్నారు. ఈవ్యాఖ్యలన్నీ కాంగ్రెస్ అజెండాలో భాగమని ఆరోపించారు. కేథార్‌నాథ్‌ ఆలయంలో 228 కేజీల బంగారం అదృశ్యమైందని స్వామీ అవిముక్తేశ్వరానంద సోమవారం ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎందుకు తొక్కిపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అక్కడ కుంభకోణం చేసి.. ఢిల్లీలో ఆలయ నమూనా నిర్మిస్తున్నారా..? అని ప్రశ్నించారు. బంగారం గోల్‌మాల్‌పై అసలు దర్యాప్తు ప్రారంభించలేదన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. తాము కమిషనర్‌ను విచారణకు డిమాండ్‌ చేసినా ఫలితం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed