Karnataka News: రామనగర జిల్లాను 'బెంగళూరు సౌత్‌'గా మార్చిన కర్ణాటక ప్రభుత్వం

by S Gopi |
Karnataka News: రామనగర జిల్లాను బెంగళూరు సౌత్‌గా మార్చిన కర్ణాటక ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రామనగర ప్రజల డిమాండ్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రామనగర, చన్నపట్న, మాగాడి, కనకపుర, హారోహళ్లి తాలూకాల భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లా నేతల బృందం రామనగరకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు మార్చాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రతిపాదించారు. ఈ మార్పు ప్రక్రియలో తదుపరి రెవెన్యూ శాఖ నోటిఫై చేయనుంది. జిల్లా పేరు మారినప్పటికీ తాలూకాల్లో ఎటువంటి మార్పులు ఉండవని, ఈ తాలూకాలు బెంగళూరు సౌత్ జిల్లాలోనే ఉంటాయని మంత్రి వివరించారు. రామనగర జిల్లా పేరు మార్పును మొదట కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రతిపాదించారని ఆయన తెలిపారు. కేబినెట్ ఆమోదం అనంతరం దీనిపై మాట్లాడిన శివకుమార్.. బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చడం వల్ల రామనగర, చన్నపట్న, మాగాడి మైసూరు వరకు అభివృద్ధి మరింత జరుగుతుంది. పరిశ్రమలు వచ్చేందుకు, ఆస్తుల విలువ పెరిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.



Next Story