Kailash Gahlot: బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్.. ఆప్‌ వ్యాఖ్యలకు కౌంటర్

by vinod kumar |
Kailash Gahlot: బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్.. ఆప్‌ వ్యాఖ్యలకు కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఢిల్లీ మంత్రి పదవికి రాజీనామా చేసిన కైలాష్ గెహ్లాట్ (Kailash Gahlot) సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా(Veerandra sachdeva), కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ (Manoharlal kattar)ల ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సచ్ దేవా గెహ్లాట్‌కు పార్టీ సభ్యత్వం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాషాయ పార్టీలో చేరాలనే నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకోలేదని తెలిపారు. ఈడీ, సీబీఐ ఒత్తిడి వల్లే బీజేపీలోకి వెళ్తున్నారని ఆప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆప్ వాదన సరికాదని తోసిపుచ్చారు. ఎవరి ఒత్తిడితోనో ఈ డిసిషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘నేను సామాన్య ప్రజలకు సేవచేయడానికి న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి ఆప్‌లో చేరాను. అప్పుడు పార్టీ ఎన్నో విలువకు కట్టుబడి ఉండేది. కానీ ప్రస్తుతం దాని భావజాలానికి రాజీ పడింది. పార్టీ అసలు లక్ష్యాన్ని విడిచిపెట్టింది. ఆ వైపుగా పని చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తేనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ భావజాలంతో ప్రేరణ పొందానని, నిరంతరం బీజేపీతో పని చేస్తానని తెలిపారు. పార్టీ సీనియర్ నేతలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతానన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ గెహ్లాట్ పార్టీకి రిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఆప్ ని వీడిన మరుసటి రోజే కాషాయ పార్టీలో జాయిన్ అవడం గమనార్హం. మరోవైపు గెహ్లాట్ పార్టీని వీడటంపై కేజ్రీవాల్ స్పందించారు. గెహ్లాట్ ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఆయనకు ఆ స్వేచ్ఛ ఉందని తెలిపారు.

Next Story

Most Viewed