Israel-Hezbollah tension: ఇజ్రాయెల్ హిజ్బొల్లా మధ్య ఉద్రిక్తత..లెబనాన్‌లోని భారతీయులకు ఎంబసీ సూచనలు

by vinod kumar |
Israel-Hezbollah tension: ఇజ్రాయెల్ హిజ్బొల్లా మధ్య ఉద్రిక్తత..లెబనాన్‌లోని భారతీయులకు ఎంబసీ సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, ఉగ్రవాద సంస్థ హిజ్బొల్లా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లెబనాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం సోమవారం పలు సూచనలు జారీ చేసింది. లెబనాన్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. దౌత్య కార్యాలయంతో సంబంధాలు కొనసాగించాలని ఆర్డర్స్ జారీ చేసింది. ‘ఈ ప్రాంతంలో ఇటీవలి పరిణామాల దృష్యా.. లెబనాన్‌లోని భారతీయ పౌరులు, ఆ దేశానికి వెళ్లాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర సమయంలో మెయిల్ ఐడి ద్వారా బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. cons.beirut@mea. gov.in లేదా ఫోన్ నంబర్ +96176860128లో కాంటాక్ట్ అవ్వాలి’ అని పేర్కొంది.

కాగా, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా హమాస్ కు మద్దతుగా లెబనాన్ భూభాగం నుంచి హిజ్బొల్లా దాడులకు పాల్పడుతోంది. ఇటీవల ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్ బాల్ మైదానంపై రాకెట్ దాడి చేయగా..12 మంది ఇజ్రాయెలీలు మరణించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ హిజ్బొల్లాపై ప్రతీకారం తప్పదని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు దక్షిణ లెబనాన్‌లో సోమవారం ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఎంబసీ తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో పలువురు లెబనాన్ పౌరులు సైతం మరణించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed