బీజేపీ గెలిచినా.. 370 కంటే తక్కువే: ప్రశాంత్ కిషోర్

by S Gopi |
బీజేపీ గెలిచినా.. 370 కంటే తక్కువే: ప్రశాంత్ కిషోర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బీజేపీపై ప్రజలకు పెద్దగా కోపం లేదని.. అయితే, ఆ పార్టీ లక్ష్యంగా ఉన్న 370 సీట్ల మార్కును మాత్రం దాటకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మంగళవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనుకున్న మార్కును బీజేపీ చేరే అవకాశాలు తక్కువగా ఉన్నందున స్టాక్ మార్కెట్లు నిరాశ చెందవచ్చన్నారు. 'ఒక కంపెనీ నుంచి అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు, అవి మెరుగైన పనితీరు చూపించినప్పటికీ మార్కెట్లు సదరు కంపెనీలో షేర్లను విక్రయిస్తాయి. బీజేపీ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. 370 సీట్ల కంటే తక్కువ గెలిస్తే అది స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనుంది. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాను. 2019 నాటి కంటే కొన్ని సీట్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నాను' అని చెప్పారు. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై కోపం ఉంటే, అందుకు ప్రత్యామ్నాయం కూడా ఉండాలి. అప్పుడే ప్రజలు వారికి ఓటు వేసేందుకు ఆలోచిస్తారు. మోడీపై ప్రజల్లో ఆగ్రహం ఉందనే అభిప్రాయం ఎక్కడా వినట్లేదని పీకే అభిప్రాయపడ్డారు.

ఉత్తర, పశ్చిమ భారత్‌లో సుమారు 325 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బీజేపీ 2014 నుంచి మంచి పట్టు ఉంది. తూర్పు, దక్షిణాదిన బీజేపీకి బలం తక్కువ. గెలుపుపై ప్రభావం ఉంటే ఉత్తరం, పశ్చిమ ప్రాంతాల్లో ఉంటుంది. కానీ, ఈసారి తూర్పు, దక్షిణాదిన ఓట్లతో పాటు సీట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లోనూ బీజేపీకి సీట్లు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధానంగా మోడీ పొరపాలను ఇండియా కూటమి అవకాశంగా మలుచుకోకపోవడమేనని పీకే చెప్పారు. ఇండియా కూటమి ఏర్పడటమే ఆలస్యంగా జరిగింది. మరోవైపు ప్రధాని అభ్యర్థిని ప్రకటించడంలోనూ విఫలమైంది. బీజేపీకి ధీటుగా బలమైన వ్యక్తి, పరిణామాలు లేవు.

బీజేపీ ఎక్కువ సీట్లతో గెలుపొందినప్పటికీ, దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండటం మంచిదే. బీజేపీ గెలిచిన తర్వాత కూడా విపక్షాలు బలహీనపడవు. గతంలో మెజారిటీ సీట్లతో బీజేపీ గెలిచినప్పటికీ రైతుల ధర్లా దిగొచ్చి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. కాబట్టి ఇకపై ప్రభుత్వమే మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed